విమానం నుంచి జారిపడ్డ ఎయిర్ హోస్టెస్.. తీవ్రగాయాలు
ఎయిర్హోస్టెస్ విమానం తలుపు మూయబోతూ ప్రమాదవశాత్తు విమానం నుంచి కింద పడిపోయారు.
విమానం నుంచి ఎయిర్ హోస్టెస్ జారి కిందపడిన సంఘటన ముంబయి విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎయిర్ హోస్టెస్ తీవ్రగయాలపాలయ్యారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్కు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరిగింది. ఈరోజు ఉదయం ముంబయి నుంచి దిల్లీకి వెళ్లాల్సిన విమానంలో ప్రయాణికులంతా ఎక్కిన తర్వాత 53ఏళ్ల ఎయిర్హోస్టెస్ విమానం తలుపు మూయబోతూ ప్రమాదవశాత్తు విమానం నుంచి కింద పడిపోయారు.
బోయింగ్-777 విమానం తలుపు మూస్తుండగా తమ సిబ్బందిలో ఒకరైన హర్షా లోబో దురదృష్టవశాత్తు కింద పడిపోయారని ఎయిరిండియా వెల్లడించింది. ఆమె కాళ్లకు తీవ్ర గాయాలవ్వడంతో నానావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించింది.