'అగ్నిపథ్'కు సొంత పార్టీ నుంచే మోడీకి విమర్శలు.. వరుణ్ గాంధీ ప్రశ్నల వర్షం
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సైతం సొంత పార్టీపై మండిపడ్డారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా కోరాడు.
భారత సైన్యానికి కొత్త జవసత్వాలను నింపడంతో పాటుగా దేశంలోని యువతకు 10 లక్షల ఉద్యోగావకాశాలను కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకానికి (Agnipath Scheme) శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఎంపికయ్యే అభ్యర్థులకు ఇచ్చే జీత భత్యాలు, పెన్షన్, సేవల తర్వాత లభించే ఇతరత్రా అవకాశాలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ ప్రకటనపై ఓ వైపు విపక్షాలు విమర్శలు సంధిస్తుంటే... మరోవైపు నరేంద్ర మోదీ సర్కారుకు సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు ఎదురవుతున్నాయి.
బీజేపీ యువనేత, ఎంపీ వరుణ్ గాంధీ బుధవారం అగ్నిపథ్ పథకంపై ఓ ట్వీట్ సంధించారు. అగ్నిపథ్ పథకంపై దేశ యువతలో పలు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్న ఆయన దీనిపై మీ అభిప్రాయమేమిటంటూ దేశ ప్రజలను కోరారు. గతంలోనూ బీజేపీ సర్కారు తీసుకున్న పలు నిర్ణయాలపైనా వరుణ్ గాంధీ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
మరోవైపు.. ఆర్మీ, ఇతర రక్షణ దళాలలో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. కరోనా వల్ల రెండేళ్లుగా నిలిచిపోయిన డిఫెన్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని ఎదురుచూస్తున్న ఆశావహులు.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ వల్ల ఒక్క సారిగా నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో బుధవారం నిరసన వ్యక్తం చేశారు.
Also Read:Agnipath Scheme: ఆర్మీలో 46 వేల ఉద్యోగాలు.. అగ్నిపథ్ స్కీమ్ ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు బుధవారం యూపీలోని లక్నోలో, బీహార్ లోని బరౌనీతో ముజఫర్పూర్లో కలిపే జాతీయ రహదారి 28పై నిరసన తెలిపారు. యువకులు టైర్లు, హోర్డింగ్లను తగులబెట్టారు. ‘‘ భారతీ దో యా అర్థి దో (మాకు ఉద్యోగాలు ఇవ్వండి లేదా మమ్మల్ని చంపండి) ’’ అంటూ నినాదాలు చేశారు. అలాగే బీహార్ లోని బక్సర్లో రైల్వే ట్రాక్లపై భారీ సంఖ్యలో అభ్యర్థులు బైఠాయించారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ప్రదర్శన ఇచ్చారు.
కాగా.. కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన అగ్నిపథ్ పథకంలో 'అగ్నివీర్'లను నాలుగేళ్లపాటు నమోదు చేసుకోవాలని ప్రతిపాదించింది. నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత వారిని రెగ్యులర్ కేడర్ కోసం స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ అగ్నిపథ్ పథకం కింద ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో రిక్రూట్మెంట్ అవుతారు. ఈ పథకం కింద రిక్రూట్ అయిన అగ్నివీరుల కోసం ప్రభుత్వం సాయుధ దళాలలో ప్రత్యేక ర్యాంక్ను ఏర్పాటు చేస్తుంది.
ఈ అగ్నిపథ్ స్కీమ్ ద్వారా 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను త్రివిధ దళాల్లో సర్వీసుల్లోకి తీసుకుంటారు. వీరికి ఆరు నెలల శిక్షణ కాలం ఉంటుంది. దీని ద్వారా మహిళలు, పురుషులను ఇద్దరినీ రిక్రూట్ చేసుకుంటారు. ఈ అభ్యర్థులు నెలకు మొత్తం అలవెన్సులతో కలుపుకొని రూ. 30 నుంచి 40 వేల రూపాయిల జీతం అందుతుంది. 90 రోజుల్లో అగ్నివీర్లను నియమించేందుకు రిక్రూట్మెంట్ ర్యాలీల నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ఏడాది 46,000 మంది సైనికులను ఈ పథకం కింద నియమించుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో ఆర్మీలో 40,000 మంది, వైమానిక దళంలో 3,000, నేవీలో 3,000 మందిని రిక్రూట్ చేసుకోనుంది.