Today Top 5 News : ఈ రోజు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే..
Today Top 5 News : మీరు ఇవాళ్టి టాప్ న్యూస్ ఒకేచోట తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మీకోసమే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, నేషనల్ , ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ లో టాప్ 5 వార్తలు ఇక్కడ అందిస్తున్నాం.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో ఈ వారంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండగా, గురువారం మరో అల్పపీడనం ఏర్పడి శుక్రవారానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఈ వారమంతా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, పిడుగులు, ఈదురుగాలులు ఉంటాయని తెలిపింది.
తెలంగాణలో సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు ఉంటాయని APSDMA ప్రకటించింది. గురువారం నుంచి శనివారం వరకు తీరప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు.
సీఎం చంద్రబాబుకు శంకరయ్య లీగల్ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి హాట్టాపిక్గా మారింది. ఈ కేసులో తనపై చేసిన ఆరోపణలపై మాజీ సీఐ జె. శంకరయ్య, ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపారు. అసెంబ్లీ వేదికపై బహిరంగ క్షమాపణలు చెప్పాలనీ, రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
2019లో విధుల్లో నిర్లక్ష్యం ఆరోపణలతో సస్పెన్షన్ ఎదుర్కొన్న శంకరయ్య, సీబీఐ దర్యాప్తులో కూడా వివాదాస్పద వాంగ్మూలం ఇచ్చారు. ప్రస్తుతం కర్నూలు రేంజ్లో వీఆర్గా కొనసాగుతున్న ఆయన, ఇప్పుడు ఇచ్చిన నోటీసులు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.
EPFO: ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బులు విత్డ్రా
EPFO సభ్యులకు గుడ్ న్యూస్.. ఇకపై జీతం నుంచి కట్ అయ్యే పీఎఫ్ డబ్బులు ఏటీఎం ద్వారా కూడా విత్డ్రా చేసుకునే సదుపాయం రానుంది. ఈ సేవను 2026 జనవరి నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. అక్టోబర్ రెండో వారంలో జరిగే సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీలు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
విత్డ్రా పరిమితులపై చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం EPFOలో 7.8 కోట్ల సభ్యులు ఉండగా, రూ.28 లక్షల కోట్లు డిపాజిట్ రూపంలో ఉన్నాయి. సభ్యుల కోసం ప్రత్యేక EPFO కార్డు జారీ చేసి, సాధారణ ఏటీఎం మాదిరిగానే డబ్బు డ్రా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ట్రంప్ ఆరోపణలు.. భారత్ మావైపే: జెలెన్స్కీ
ట్రంప్ భారత్పై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్ తమవైపే ఉందని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రష్యాతో ఇంధన ఒప్పందం సమస్యగా ఉన్నా, దీనిని ట్రంప్ పరిష్కరించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.
మోదీ ప్రభుత్వం విధానంలో మార్పులు చేస్తుందని చెప్పారు. అయితే చైనా మాత్రం రష్యా యుద్ధం ముగియడం తనకు లాభం కాదని భావిస్తోందని వ్యాఖ్యానించారు. ఐరాస సమావేశంలో భారత్, చైనాలు యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నాయంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై జెలెన్స్కీ ఈ కామెంట్స్ చేశారు.
ఆసియా కప్ 2025 : బంగ్లాపై గెలిస్తే ఫైనల్ కు భారత్
సూపర్ ఫామ్లో ఉన్న టీమ్ఇండియా మరో పోరుకు సిద్ధమైంది. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్లలో గెలిచి, అన్ని విభాగాల్లో ఆధిపత్యం చాటుతూ టైటిల్ ఫేవరెట్గా దూసుకుపోతోంది. పాకిస్థాన్పై వరుస విజయాలు సాధించడం జట్టుకు భారీ ఉత్సాహాన్నిచ్చింది. సూర్యకుమార్ సేన అదే ఆత్మవిశ్వాసంతో బంగ్లాదేశ్పై బలమైన పంచ్ వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు సూపర్ 4లో శ్రీలంకను ఓడించి సంచలనం సృష్టించిన బంగ్లా, అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఈ సమరం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.