- Home
- Life
- Food
- Mrigashira Karte: మృగశిర రోజు చేపలు ఎందుకు తింటారో తెలుసా.? మరి వెజ్ వాళ్లు ఏం చేయాలి.?
Mrigashira Karte: మృగశిర రోజు చేపలు ఎందుకు తింటారో తెలుసా.? మరి వెజ్ వాళ్లు ఏం చేయాలి.?
ఆదివారం మృగశిరా కార్తె వచ్చింది. ఉదయం నుంచి మార్కెట్లన్నీ చేపలతో హడావుడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు మృగశిరా కార్తె రోజు చేపలు తినే ఆనవాయితే ఎలా వచ్చింది.? దీని వెనకాల ఉన్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరోగ్యం, సంప్రదాయం
తెలుగు క్యాలెండర్ ప్రకారం మృగశిర కార్తెను వర్షాకాల ప్రారంభానికి సంకేతంగా భావిస్తారు. ఈ సందర్భంగా చేపలు తినే సంప్రదాయం వెనుక ఉన్న ఆరోగ్య కారణాలు, వాతావరణ మార్పులు, శాఖాహారులకు ప్రత్యామ్నాయాలు ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆ వివరాలు తెలుసుకుందాం.
మృగశిర కార్తెతో వర్షాకాల ఆరంభం
వైశాఖ మాసం చివర్లో రోహిణి కార్తె ఎండలు దంచి కొడుతాయి. ఈ సమయంలో రోకల్లు కూడా పగిలిపోతాయని చెబుతుంటారు. అయితే దీని తర్వాత వచ్చే మృగశిర కార్తె వాతావరణాన్ని చల్లబరుస్తూ నైరుతి రుతుపవనాలకు నాంది పలుకుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం లభించే ఈ సమయంలో రైతులు, సామాన్య ప్రజలు ఎంతో సంతోషిస్తారు.
చేపలు తినే సంప్రదాయం వెనుక కారణం ఏమిటి?
మృగశిర కార్తె మొదటి రోజున చేపలు తినడం ఒక సంప్రదాయంగా చాలా కాలంగా వస్తోంది. వాస్తవానికి దీని వెనుక శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడం వల్ల శరీరంపై ప్రభావం పడుతుంది.
రోగ నిరోధకశక్తి తక్కువై జ్వరం, దగ్గు, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ సమయంలో చేపలు తినడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభించి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మరి శాఖహారులు ఏం తినాలి.?
చేపలు తినని శాఖాహారుల కోసం పెద్దలు మంచి ప్రత్యామ్నాయాలను సూచించారు. మృగశిర కార్తె రోజున ఇంగువను బెల్లంతో కలిపి ఉండలుగా చేసి తినడం ఒక సాధారణ ఆచారం. ఇది శరీరానికి ఉష్ణతను అందించి పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాక, చింత చిగురు పప్పులో ఇంగువ పోపు వేసి తినడం ద్వారా చేపలతో సమానమైన ప్రయోజనం పొందవచ్చని చెబుతారు.
శాస్త్రీయ కారణాలు
మన పెద్దలు రూపొందించిన సంప్రదాయాలు ఏవీ మూఢనమ్మకాలపై ఆధారపడినవే కావు. మానవ శరీరాన్ని, కాల చక్రాన్ని బట్టి ఏర్పడిన ఈ ఆచారాలకు శాస్త్రీయ నేపథ్యం ఉంది.
రుతుపవనాల సమయంలో వచ్చే వ్యాధులకు ముందు జాగ్రత్తగా మంచి పోషకాహారాన్ని అందించడం అనే ఆలోచనే వీటి వెనుక ఉందని చెబుతుంటారు.
ఆరోగ్యవంతమైన జీవనశైలికి తొలి అడుగు
మృగశిర కార్తె అంటే కేవలం ఒక తిథి మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన జీవనశైలికి నూతన ఆరంభం. వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా శరీరాన్ని తగిన విధంగా సిద్ధం చేసుకోవచ్చు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.