Onion Price : మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.70-80.. ఇక్కడ మాత్రం కేవలం 32 రూపాయలే
ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి… సామాన్యులు వీటిని కొనలేని పరిస్థితి వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సబ్సిడీ ధరల్లో ఉల్లిపాయలను విక్రయించేందుకు సిద్దమయ్యింది.

అతితక్కువ ధరలో ఉల్లిపాయలు..
Onion Price : ప్రతి వంటగదిలో తప్పకుండా ఉల్లిపాయలు ఉంటాయి... ఇవి లేకుండా వంట పూర్తిచేయడం అసాధ్యం అనే చెప్పాలి. ప్రతి వంటకం తాలింపులో ఉల్లిపాయలు పడాల్సిందే... ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, అందుకే '' ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు'' అని అంటుంటారు. తెలుగువారి వంటింట్లో అయితే ఉల్లిపాయలదే కీలకపాత్ర... పప్పు, సాంబార్, కర్రీ ఇలా దేంట్లో అయినా ఇవి ఉండాల్సిందే... చివరికి సద్దన్నంలో కూడా ఉల్లిపాయలు నంజుకుని తింటుంటారు.
అయితే తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే ఉల్లి ధరలు కొండెక్కాయి... మొన్నటివరకు కిలో రూ.20-30 ఉంటే ఇప్పుడు సడన్ గా హాఫ్ సెంచరీ మార్క్ దాటేసిన ధరలు సెంచరీ దిశగా పరుగుతీస్తున్నాయి. ఈ ధరలను కంట్రోల్ చేయకపోతే సామాన్యుడికి ఉల్లి దూరం కావడం ఖాయం... అందుకే రంగంలోకి దిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల తగ్గింపుకు చర్యలు చేపట్టాయి.
ఏపీలో రూ.32కే కిలో ఉల్లిపాయలు..
ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ప్రజలకు అందుబాటు ధరల్లో ఉల్లిపాయలను అందించేందుకు సిద్దమయ్యింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డిల్లీకి వెళ్లిమరీ కేంద్ర ప్రభుత్వంతో ఉల్లి ధరలపై చర్చించారు. ఈ క్రమంలోనే ఏపీకి భారీగా ఉల్లిపాయలను సరఫరా చేసేందుకు కేంద్రం అంగీకరించింది... వీటిని రాయితీ ధరలో ప్రజలకు అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లిపాయలు రూ.50-60 ధర పలుకుతున్నాయి... మంచి నాణ్యత కలిగినవి రూ.70-80 కి అమ్ముతున్నారు. దీంతో సామాన్యులు ఉల్లి కొనలేని పరిస్థితి... భవిష్యత్ లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయన్న సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం భారీ సబ్సిడీలో వివిధ నగరాల్లోని రైతు బజార్ల ద్వారా ఉల్లిపాయలు అమ్మేందుకు సిద్దమయ్యింది. కేవలం రూ.32 కే కిలో ఉల్లి అమ్మనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఉల్లి సరఫరా కోసమే 'కందా ఎక్స్ ప్రెస్' పరుగులు
ఉల్లిపాయల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది... ఇందులో భాగంగానే 'కందా ఎక్స్ ప్రెస్' రైలుని నడుపుతోంది. కేంద్రం వద్ద భారీగా ఉల్లి నిల్వల ఉన్నాయి... వీటిని వివిధ ప్రాంతాలకు తరలించేందుకు ఈ కందా ట్రైన్ ను ఉపయోగిస్తున్నారు. ఇలా ఉల్లి కొరత లేకుండా చూసి ధరలను నియంత్రించే ప్రయత్నం చేస్తోంది కేంద్ర పౌరసరఫరాల శాఖ.
ఉల్లిపాయల ధరలు మండిపోతున్న నగరాలకు ఈ కందా ట్రైన్ ను నడుపుతున్నారు... ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో సబ్సిడీ ధరకు ఉల్లిని విక్రయిస్తున్నారు. ఇలా కొన్నిచోట్ల కేవలం రూ.35 కే ఉల్లిపాయల అమ్మకాలు ప్రారంభమయ్యింది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణకు కూడా భారీ ఉల్లి లోడ్ తో కందా ఎక్స్ ప్రెస్ రాబోతోంది... తక్కువ ధరకే తెలుగు ప్రజలకు ఉల్లి లభించనుంది.
డీమార్టు లాగే ఏపీలో మీ మార్టులు
సామాన్య ప్రజలకు తక్కువ ధరకే నిత్యావసర వస్తువులు అందించేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. డీమార్టు మాదిరిగానే 'మీ మార్టు' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా స్టోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో అతి తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అమ్మాలని నిర్ణయించింది. ఇలా ఈ అక్టోబర్ ఫస్ట్ నుండి తొలివిడతగా 1000 కి పైగా మీ మార్టులను ప్రారంభించనున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మీ మార్టుల ద్వారా 64 రకాల సరుకులను పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే అందించనున్నారు.
ఇక పామాయిల్, కందిపప్పు వంటివి మార్కెట్ ధరకంటే 25-30 శాతం తక్కువ ధరకే అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. కేంద్రం ఉల్లిపాయలతో పాటు ఫామాయిల్, కందిపప్పును రాష్ట్రానికి కేటాయించిందని... వీటిని సామాన్యుల వద్దకు చేర్చడమే తమ లక్ష్యమన్నారు. నిత్యావసరాల ధరల నియంత్రణకు కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

