కంగనాకి వై ప్లస్ కేటగిరి భద్రత.. కేంద్రం సంచలన నిర్ణయం
ఇటీవల కాలంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్కి బోల్డ్ కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమెకి ప్రాణహాని ఉన్నకారణంగా వై ప్లస్ కేటగిరి భద్రతని కల్పిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్కి వై ప్లస్ కేటగిరి భద్రతని కల్పిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో కంగనా బోల్డ్ కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు విషయంలో ఆమె స్వరం పెంచారు. బాలీవుడ్లోని నెపోటిజమే కారణమని వెల్లడించారు. దీంతోపాటు డ్రగ్ కేసులో స్టార్స్ అందరిని టెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు శివసేన నాయకుల ఆగడాలను ప్రశ్నించారు. ముంబయి పాక్ ఆక్రమిత కాశ్మీర్లా ఉందని ఇటీవల కామెంట్ చేసి సంచలనం సృష్టించారు. దీంతో శివసేన నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. మహారాష్ట్ర, ముంబయి, మరాఠాల గురించి మితిమీరి మాట్లాడితే సహించేది లేదని, తాను చేసిన వ్యాఖ్యలపై కంగనా క్షమాపణలు చెప్పాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. దీంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమెకి వై ప్లస్ కేటగిరి భద్రతని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుందని కేంద్ర అధికార వర్గాలు వెల్లడించినట్టు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా తెలిపింది.
బాలీవుడ్లో ముక్కు సూటితనంతో వ్యవహరిస్తూ వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న కంగనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ, చర్చనీయాంశంగా మారారు. దీంతోపాటు చాలా రోజులుగా నెపోటిజంపై ఆమె గళమెత్తుతున్నారు. ముఖ్యంగా నెపోటిజంపై ఆమె చేసిన వ్యాఖ్యలకు బాలీవుడ్ సినీ స్టార్స్ సైతం స్పందించి విమర్శనాస్త్రాలు గుప్పించారు. దీంతో గత కొన్ని రోజులుగా బాలీవుడ్ ఈ విషయం తీవ్ర దుమారం రేపుతుంది.
మరోవైపు కంగనా క్షమాపణ చెప్పకుంటే ముంబయిలో అడుగుపెట్టనివ్వమని ట్విట్టర్ ద్వారా శివసేన కార్యకర్తలు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ విమర్శలకూ కంగనా ఘాటుగా స్పందించింది. తాను ఈ నెల 9న ముంబయికి వస్తున్నానని, దమ్ముంటే తనని ఆపాలని ఛాలెంజ్ విసిరింది. ఈ నేపథ్యంలో కంగనాకు ప్రాణ హాని ఉందని, ఆమె భద్రతపై సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ భద్రత కల్పించేందుకు ముందుకొచ్చింది. ఇప్పుడు కేంద్రం కూడా ఆమెకు వై ప్లస్ భద్రత కల్పించేందుకు సిద్ధపడింది. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు హోంశాఖ వర్గాలు తెలిపిందని జాతీయ మీడియా తెలిపింది. మరి ఇది మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.
ఇదిలా ఉంటే గతేడాది కంగనా నటించిన `మణికర్ణిక` సినిమా విషయంలో మరాఠీలు, శివసేనకు చెందిన సంస్థలు వివాదాలు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కంగనా `తలైవి`తోపాటు `ధాఖడ్` చిత్రాల్లో నటిస్తుంది.