జూలైలో విపణిలోకి హుండాయ్ విద్యుత్ ‘కోనా’:పండుగలకు ‘గ్రాండ్ ఐ10’
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ దేశీయ విపణిలోకి తొలిసారి విద్యుత్ ఆధారిత ‘కోనా’ మోడల్ ఎస్యూవీ మోడల్ కారు ప్రవేశపెడతామని ప్రకటించింది. వచ్చే పండుగల సీజన్లో ‘గ్రాండ్ ఐ10’ కారును ఆవిష్కరిస్తామని తెలిపింది.
గువహటి: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ వచ్చే జూలై నెలలో దేశీయ విపణిలోకి తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్ కారు ‘కోనా’ ప్రవేశ పెడుతున్నట్లు సంస్థ ఇండియా సీనియర్ జనరల్ మేనేజర్ పునీత్ ఆనంద్ చెప్పారు. ‘భారత విపణిలో హ్యుండాయ్ కొత్త మోడళ్లను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు.
దీనిలో భాగంగానే కోనా ఎస్యూవీ ఎలక్ట్రిక్ వాహనాన్ని జులైలో భారత్లో విడుదల చేస్తామని సీనియర్ జనరల్ మేనేజర్ పునీత్ ఆనంద్ తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ వాహనం పూర్తి వివరాలను చెప్పలేదు.
ఈ మోడల్ కారు మార్కెట్లోకి విడుదల చేసిన వచ్చే పండుగల సీజన్లో మరో సరికొత్త మోడల్ ‘గ్రాండ్ ఐ10’ ని భారత విపణిలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంస్థ సీనియర్ జనరల్ మేనేజర్ పునీత్ ఆనంద్ పేర్కొన్నారు.
ఈ ఏడాది మే 21న హ్యుండాయ్ కంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ‘హ్యుండాయ్ వెన్యూ’ మోడల్ కారును భారత్లో విడుదల చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే 20 వేల బుకింగ్స్ చేసుకున్నారని ఆనంద్ చెప్పారు. ఈ కారు నిరీక్షణ కాలం 3–4 నెలలుగా ఉంది.
వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా ప్రస్తుతం చెన్నై హ్యుండాయ్ ప్లాంట్లో నెలకు ఏడు వేల యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నారు. వినియోగదారుల డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని రానున్న 3-4 నెలల్లో నెలకు 10 వేల యూనిట్లను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రచించినట్లు పునీత్ ఆనంద్ పేర్కొన్నారు.
ఒకసారి భారత మార్కెట్లో వెన్యూ అమ్మకాలు ఒక స్థాయికి చేరుకోగానే సంస్థకు పట్టు ఉన్న విదేశీ మార్కెట్లకు ఈ మోడల్ను ఎగుమతి చేస్తామని హ్యుండాయ్ ఇండియా సీనియర్ జనరల్ మేనేజర్ పునీత్ ఆనంద్ అన్నారు.