హైదరాబాద్ రోడ్లపై ఇక ఎలక్ట్రికల్ ఆటోలు, కేవలం రూ.250 మాత్రమే...
హైదరాబాద్ రోడ్లపై ఇకనుంచి ఎలక్ట్రికల్ ఆటోలు పరుగుతీయనున్నాయి. ఇందుకోసం తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. మొదటి దశలో భాగంగా 50 ఎలక్ట్రికల్ వాహనాలను హైదరాబాద్ లో ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి టీఎస్టీడీసీ ప్రయత్నిస్తోంది.
హైదరాబాద్ రోడ్లపై ఇకనుంచి ఎలక్ట్రికల్ ఆటోలు పరుగుతీయనున్నాయి. ఇందుకోసం తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. మొదటి దశలో భాగంగా 50 ఎలక్ట్రికల్ వాహనాలను హైదరాబాద్ లో ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి టీఎస్టీడీసీ ప్రయత్నిస్తోంది.
హైదరాబాద్...స్వదేశీ పర్యాటకులనే కాదు విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్న అత్యంత సుందర నగరం. పాతనగరంలో అనేక చారిత్రక కట్టడాలతోనూ, ఐటీ డెవలప్ మెంట్ తో ఆధునిక కట్టడాలతోనూ అటు చరిత్ర ప్రియుల్ని, ఇటు టెక్నాలజీ ప్రియుల్ని ఈ నగరం ఆకట్టుకుంటోంది. అయితే నగరం దినదినాభివృద్ది చెందుతుండటంతో కాలుష్యం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఈ కాలుష్యం కారణంగా నగర బ్రాండ్ ఇమేజ్ కోల్పోయే ప్రమాదం ఉందని గ్రహించి అప్రమత్తమైన పర్యాటక శాఖ ఇందుకోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తోంది.
హైదరాబాద్ లో కేవలం పర్యాటకుల కోసమే ఎలక్ట్రికల్ ఆటోలను ప్రవేశపెడుతోంది. అంటే స్వతహాగా కాలుష్యం వెదజల్లని వాహనాల్లో పర్యాటకులు ప్రయాణించవచ్చన్న మాట. నగరంలో ముఖ్యంగా చారిత్రక కట్టడాల వద్ద వీటిని అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. కాలుష్యం పెరుగకుండా చూసుకోోవడంతో పాటు, పర్యాటకులను ఆకట్టుకోడానికి ఇలా ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు టీఎస్టీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు. పర్యావరణాన్ని కాలుష్య పరిచే ఇంధనాలతో కాకుండా ఆ ఆటో కేవలం ఎలక్ట్రిక్ బ్యాటరీ ద్వారానే నడుస్తుందని ఆయన తెలిపారు.
అయితే ఈ వాహనాల్లో ప్రయాణించాలనుకునే వారు రోజువారి టికెట్లను పొందాల్సి ఉంటుందని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. 24 గంటల ప్రయాణం కోసం కేవలం రూ. 250 చార్జీ మాత్రమే వసూలు చేయనున్నారు. దీంతో అత్యంత చవకగా, కాలుష్యం లేని నగర ప్రయాణాన్ని పర్యాటకులకు అందించాలని టీఎస్టీడీసీ భావిస్తోంది.