పరిస్థితి అదుపులోనే ఉంది: వైఎస్ జగన్, వైజాగ్ కు పయనం
విశాఖపట్నంలోని ఎల్జీ పాలీమర్స్ లో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. ఆయన విశాఖ బయలుదేరారు.
విశాఖపట్నం: విశాఖపట్నంలో ఎల్జీ పాలీమర్స్ లో గ్యాస్ లీకైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన అన్నారు. బాధితులకు వైద్య సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఆయన తాడేపల్లి నుంచి విశాఖపట్నం బయలుదేరారు. అక్కడ ఆయన బాధితులను పరామర్శించనున్నారు.
విశాఖ లో ఆర్ ఆర్ వెంకటాపురం వద్ద పరిశ్రమలో గ్యాస్ లీకైన ఘటన దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. తెల్లవారుజామున డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందిందని చెప్పారు. తక్షణమే స్పందిన సంఘటన స్థలానికి సిపీ చేరుకున్నట్లు తెలిపారు.
పరిసర జిల్లాల నుండి అధికారులను, సిబ్బందిని , ఏ పి ఎస్ పి బలగాలను సంఘటన స్థలానికి పంపి బాధితులకు సహాయ కార్యక్రమాలు చేట్టామని అన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పారు .పరిస్థితిని ఎపపటికప్పుడు సమీక్షిస్తూ, ఘటనపై వివరాలను ఎప్పటకప్పుడు ముఖ్యమంత్రికి వివరిస్తున్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గల ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నగరంలోని గోపాలపట్నం పరిధిలో గల ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఆ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైంది. ఆ విషవాయువు దాదాపు 3 కిలోమీటర్ల మేర విస్తరించింది. బుధవారం ఆర్థరాత్రి దాటిన తర్వాత విషవాయువు లీకైంది.
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు. మూగజీవులు కూడా దాని తీవ్రతకు గురై పడిపోతున్నాయి. మనుషులు అక్కడికక్కడే కుప్ప కూలిపోతున్న దృశ్యాలను కూడా కనిపిస్తున్నాయి.
విషయవాయువుతో చర్మంపై దద్దుర్లు, కళ్ల మంటలో, కడుపులో వికారం పుట్టడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇళ్లు వదిలేసి మేఘాద్రి గెడ్డ వైపు పరుగులు తీశారు. ఐదు గ్రామాల ప్రజలను అధికారులు అధికారులు తరలిస్తున్నారు.
తీవ్ర అస్వస్థకు గురైనవారిని అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలిస్తన్నారు. అస్వస్థకు గురైనవారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ నగరం పోలీసు కమిషనర్ ఆర్ కె మీనా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్య సిబ్బంది ఆర్ఆర్ వెంకటాపురం ప్రాంతానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గురువారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో విషవాయులు లీలకైనట్లు అధికారులు గుర్తించారు. రసాయన వాయువు లీకేజీని అదుపు చేసేందుకు అధికారులు, సిబ్బంది ప్రయత్నాలు సాగిస్తున్నారు.