Asianet News TeluguAsianet News Telugu

మరోసారి తెరపైకి అమరావతి అంశం: స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు అమలు చేయడం లేదని దాఖలైన రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది.

ap high court on contempt of court petition over amaravati verdict
Author
Amaravati, First Published May 5, 2022, 11:39 AM IST | Last Updated May 5, 2022, 11:46 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు అమలు చేయడం లేదని దాఖలైన రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై లాయర్ ఉన్నం మురళీధర్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పనుల పురోగతిపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకుంటామా..? లేదా..? అనేది తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది. అనంతరం విచారణను జూలై 12కు వాయిదా వేసింది. 

. రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు అమలు చేయడం లేదని రైతుల తరపున లాయర్ మురళీధర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు.  ఉద్దేశ్యపూర్వకంగానే రాజధాని తీర్పును ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. నిధులు లేవనే సాకుతో జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. 

ఇక, మార్చి మూడో తేదీన రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. శాసన, కార్యనిర్వహక, న్యాయ వ్యవస్థలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ శాసనం చేసే అధికారం శాసనసభకు లేదని చెప్పింది. రాజధాని ప్రాంతలో రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాలయాను నెల రోజుల్లో కల్పించాలని ఆదేశించింది. రాజధాని కోసం సమీకరించిన భూములను రాజధాని  నగర నిర్మాణ, రాజధాని ప్రాంత అభివృద్దికి తప్ప.. తాకట్టు పెట్టడానికి, మూడో వ్యక్తికి హక్కు కల్పించొద్దని స్పష్టం చేసింది. 

ఏప్రిల్ 3 లోగా రైతుల ప్లాట్లలో పనులు పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది. అయితే గడువు ముగిసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తరఫున సీఎస్ సమీర్ శర్మ కోర్టులో  అఫిడవిట్ దాఖలు చేశారు. 190 పేజీలతో కూడిన అఫిడవిట్​ను హైకోర్టుకు సమర్పించారు. సీఆర్డీఏ చట్టంలో పనుల పూర్తికి మరో నాలుగేళ్లు పొడిగించామని  ప్రభుత్వం నివేదించింది. ప్రభుత్వ నిర్ణయంతో.. 2024 జనవరి వరకు సమయం ఉందని.. హైకోర్టుకు తెలిపింది. 

రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు 6 నెలలు కాదు.. 60 నెలలు కావాలని సీఎస్ పేర్కొన్నారు. వర్కర్లు, యంత్రాలను రప్పించేందుకే 2 నెలల సమయం అవసరమని అఫిడవిట్‌లో సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. అమరావతిలో పనులు మొదలుపెట్టేందుకు 8 నెలల సమయం పడుతుందని ఆయన చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios