ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ... చంద్రబాబు అభిప్రాయమేమిటో..?: మంత్రి అవంతి
విశాఖను పరిపాలన రాజధాని చేయాలన్ని సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ విశాఖపట్నంలో మంత్రి అవంతి శ్రీనివాస్ ఆద్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖను ప్రకటించడాన్ని స్వాగతిస్తూ ఆదివారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖను పరిపాలన రాజధానిగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం చాలా గొప్పదని ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంత్రి ఆధ్వర్యంలోనే విశాఖ తగరపు వలస లో ఈ భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా తగరపు వలస ప్రధాన కూడలిలో మంత్రి అవంతి మాట్లాడుతూ... విశాఖను రాజధానిగా కొనసాగడానికి చంద్రబాబు అనుకులమో, వ్యతిరేకమో చెప్పాలన్నారు. ఆయనకు చిత్తశుద్ధి వుంటే విశాఖలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
read more చిన్నారులకు స్వయంగా పోలీయో చుక్కలు వేసిన మంత్రి అవంతి
గతంలో టీడీపీ అధికారంలో ఉండగా అమరావతిలో రైతుల భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక పారదర్శకంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు అభివృద్ధి జరిగే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రానున్న కాలంలో విశాఖను అంతర్జాతీయ స్థాయిలో మరింత అభివృద్ధి చేస్తారన్న నమ్మకం సీఎంపై వుందని మంత్రి తెలిపారు.
ఈ భారీ ర్యాలీలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, నగర వైసీపీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మళ్ళా విజయప్రసాద్, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్రమాని నిర్మల, వైసీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డితో పాటు తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.