అయ్యన్నపాత్రుడూ.. చిల్లర చేష్టలు సిగ్గుచేటు: పెట్ల గణేష్ | Narsipatnam | YCP Vs TDP | Asianet Telugu
ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో కక్ష సాధింపు చర్యలు ఎక్కువైపోయాయని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ కూటమి నేతలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. అధికారులను అడ్డుపెట్టుకుని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి నియోజకవర్గంలోని నర్సీపట్నంలో టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగారని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా గణేశ్ శంకర్ ధ్వజమెత్తారు. అక్రమ నిర్మాణం అంటూ వైయస్ఆర్సీపీ నాయకుడు, బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కర్రి శ్రీను ఇంటిని కూల్చివేయడాన్ని ఆక్షేపించారు. సోమవారం తెల్లవారుజామునే శ్రీను ఇంటి వద్దకు ఎమ్మార్వో, పోలీసులు వచ్చారు. పోలీసులు బందోబస్తు మధ్య శ్రీను ఇంటి కూల్చివేత కార్యక్రమం చేపట్టారు. ఇక, అదే నియోజకవర్గంలో అంతకుముందు వైఎస్సార్సీపీ నేత చిటికెల కన్నా ఇంటిని కూడా కూల్చివేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘స్పీకర్ అయ్యన్నపాత్రుడు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసింది అభివృద్ధి చేయడానికా? లేక ఇల్లు కూలగొట్టడానికా?. ఇంట్లో ఉన్న సామాన్లు బయటికి తీయడానికి అవకాశం లేకుండా ఇంటిని కూల్చివేస్తున్నారు. నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని ఓట్లు వేస్తే చిల్లర పనులు చేస్తున్నారు' అని మండిపడ్డారు.