డిఫెన్స్లో కేసీఆర్: చంద్రబాబు టార్గెట్ అందుకే...
తెలంగాణ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కీలకంగా మారాడు.చంద్రబాబునాయుడుపై టీఆర్ఎస్ ప్రధానంగా విమర్శలు గుప్పిస్తోంది.
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కీలకంగా మారాడు.చంద్రబాబునాయుడుపై టీఆర్ఎస్ ప్రధానంగా విమర్శలు గుప్పిస్తోంది. మహాకూటమి ఏర్పాటులో టీడీపీ ప్రధాన పాత్ర పోషించడం కూడ టీఆర్ఎస్ నేతలకు ఇబ్బందిగా మారిందనే ప్రచారం కూడ లేకపోలేదు.
మహాకూటమిలో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, టీజెఎస్లు ఉన్నాయి. ఈ పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు కొనసాగుతోంది. ఈ పార్టీల మధ్య ఓట్ల బదిలీ పరస్పరం జరిగితే రాజకీయంగా టీఆర్ఎస్కు ఇబ్బంది తప్పకపోవచ్చని రాజకీయ పరీశీలకులు భావిస్తున్నారు.
ప్రధానంగా టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ లేదా ఆ పార్టీ నేతలు చంద్రబాబునాయుడును ఎందుకు టార్గెట్ చేశారనే చర్చ ప్రస్తుతం సర్వత్రా సాగుతోంది. టీఆర్ఎస్ను గద్దెదించేందుకు మహాకూటమి ఏర్పాటులో టీడీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కీలకంగా వ్యవహరించింది.
తెలంగాణలో మహాకూటమి సక్సెస్ అయితే రాజకీయంగా నష్టం కలుగుతోందని టీఆర్ఎస్ వర్గాల్లో అభిప్రాయం నెలకొంది. ఈ తరుణంలోనే చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని కేసీఆర్ ప్రధానంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
బాబు పాలనలో తెలంగాణలో ఏ రకంగా ప్రజలు ఇబ్బందిపడ్డారు... తెలంగాణకు చంద్రబాబునాయుడు ఎలా అడ్డం పడ్డారనే విషయాలను కేసీఆర్ ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రజల ముందు సెంటిమెంట్ను ప్రస్తావిస్తున్నారు.
కేంద్రంలోని ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత కూడ రెండు రాష్ట్రాల మధ్య కూడ సంబంధాలు కొంత దెబ్బతిన్నట్టుగా కన్పిస్తోంది. కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన సమయంలో టీఆర్ఎస్ ఎన్డీఏకు అనుకూలంగా నిలిచింది.
అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు కూడ ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడ టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే తెలంగాణలో కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సిద్దమయ్యారు.
తెలంగాణలో తన పార్టీ ఉనికిని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబునాయుడుకు ఏర్పడింది. ఈ తరుణంలో టీఆర్ఎస్తో పొత్తు విషయం సాధ్యం కాలేదు. దీంతో డైరెక్టుగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొంటే టీడీపీకి రాజకీయంగా ఇబ్బంది ఏర్పడే అవకాశం లేకపోలేదు.
దీంతో మహాకూటమి ఏర్పాటు చేసి కొన్ని పార్టీల కూటమిని ఏర్పాటు చేస్తే రాజకీయంగా ఇబ్బంది ఉండదని టీడీపీ భావించింది. దీంతో మహాకూటమిని ఏర్పాటు చేయాలని బాబు టీ.టీడీపీ నేతలకు సూచించారు. దీంతో ఎల్.రమణ ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్, ఇతర పార్టీ నేతలతో చర్చించారు. మహాకూటమిలో కాంగ్రెస్, సీపీఐ, టీజెఎస్ చేరాయి.
2014 ఎన్నికల్లో టీడీపీ 15 అసెంబ్లీ, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకొంది. టీడీపీ గెలిచిన స్థానాల్లో గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో ఎక్కువ అసెంబ్లీ సీట్లున్నాయి. ఇవి కాకుండా ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట నుండి రాజేందర్ రెడ్డి, కొడంగల్ నుండి రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నుండి ఎర్రబల్లి దయాకర్ రావు, పరకాల నుండి చల్లా ధర్మారెడ్డి విజయం సాధించారు.
ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నుండి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం సండ్ర వెంకటవీరయ్య, ఆర్. కృష్ణయ్య మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు.
గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల సమయానికి చంద్రబాబునాయుడు అమరావతి నుండి పాలన సాగిస్తున్నాడు. అప్పటికే ఓటుకు నోటు కేసు తెరమీదికి రావడం.... టీడీపీ, టీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం లాంటి పరిణామాలు టీడీపికి ఇబ్బంది కల్గించాయి.గ్రేటర్ పరిధిలోని సెటిలర్లంతా ఇక్కడివారేనని కేసీఆర్ ప్రకటించారు.
అంతేకాదు ఆ ఎన్నికల సమయం నాటికి చంద్రబాబునాయుడు వచ్చి ప్రచారం చేసినా టీఆర్ఎస్ వైపే జనం మొగ్గు చూపారు. ఒక్క కార్పోరేటర్ మాత్రమే టీడీపీ కైవసం చేసుకొంది.
ఇదిలా ఉంటే టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయాల్సిన అవసరాన్ని చంద్రబాబునాయుడు గుర్తించారు. తెలంగాణలో పార్టీ లేకపోతే రాజకీయంగా ఇబ్బందులు తప్పవనే పరిస్థితులు ఉన్నాయి. ఈ తరుణంలో తెలంగాణలో చంద్రబాబునాయుడుకు చెందిన టీడీపీ క్రియాశీలకంగా పనిచేస్తే సెటిలర్ల ఓట్లు టీడీపీకి కలిసొచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
సెటిలర్లకు భరోసా కల్పిస్తే గ్రేటర్ హైద్రాబాద్తో పాటు రంగారెడ్డి, మహాబూబ్ నగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో ఓటర్ల వైఖరిలో మార్పు వచ్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే రాజకీయంగా మహాకూటమికి కలిసివచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ తరుణంలోనే చంద్రబాబునాయుడు లక్ష్యంగా కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు విమర్శల దాడిని ఎక్కుపెట్టారని రాజకీయ పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదే తరుణంలో ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డిపై ఐటీ అధికారుల సోదాలు చేయడం.. ఇదే కేసుపై ప్రశ్నించడం వంటి పరిణామాలు రాజకీయంగా తమను ఇబ్బందిపెట్టేందుకేనని రేవంత్ రెడ్డి బహిరంగంగానే కేసీఆర్, మోడీపై విమర్శలు చేశారు.
నల్గొండ, ,నిజామాబాద్ సభల్లో చంద్రబాబునాయుడుపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసును గురించి కూడ కేసీఆర్ ప్రస్తావించడం గమనార్హం. అయితే ఈ పరిణామాలను చూస్తే రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలు కూడ లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మహకూటమిలో సీట్ల సర్ధుబాటు చర్చలు సాగుతున్నాయి. మరోవైపు ఈ నాలుగు పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోను కూడ ప్రజల ముందు పెట్టనున్నాయి. కేసీఆర్ ను గద్దె దించేందుకు వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ పరిణామాలు రాజకీయంగా తమకు ఇబ్బంది కల్గించే అవకాశం లేకపోలేదని టీఆర్ఎస్కు అనుమానం ఉంది.ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ .... చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
సంబంధిత వార్తలు
చంద్రబాబు పడగొట్టాలని చూశాడు, ఓవైసీ చెప్పారు: కేసిఆర్
చంద్రబాబూ! నేను మూడో కన్ను తెరిస్తే....: కేసీఆర్
టీడీపీ నేతలు చంద్రబాబు గులామ్లు: కేసీఆర్
టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ వాయిదా.. కేసీఆర్ అనూహ్య నిర్ణయం
కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఎఫెక్ట్: కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం
ఓటుకు నోటులో అడ్డంగా దొరికిన దొంగ: బాబుపై కేసీఆర్ సంచలనం
కాంగ్రెస్ ఎఫెక్ట్: మ ళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్ను పెంచుతాం: కేసీఆర్
రేవంత్ విచారణ: కేసీఆర్ నోట చంద్రబాబు పేరు, దేనికి సంకేతం?