Heat Wave Alert : అసలుసిసలైన ఎండలు షురూ.. ఈ జిల్లాల్లో ఏకంగా 40 డిగ్రీలు, ఎల్లో అలర్ట్
Heat Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో అసలైన ఎండాకాలం ప్రారంభం అయ్యింది. ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్ర ప్రదేశ్ లో మార్చి ఆరంభంలోనే ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి.

ఇక ఎండలను కాస్కోండి..
Heat Wave Alert : చలికాలం ముగిసింది, వాతావరణం అనుకూలించడంతో ఇటీవల కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మార్చి నెల ఆరంభంతోనే అసలైన ఎండాకాలం మొదలయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని... ఎండలు మండిపోతాయని భారత వాతావరణశాఖ(IMD) హెచ్చరిస్తోంది.
ఈ తెలంగాణ జిల్లాల్లో ఎండలు
తెలంగాణలో ఇప్పటికే వేడిగాలులు, ఉక్కపోత మొదలయ్యింది.. మరో రెండుమూడు రోజుల్లో ఎండలు మరింత పెరుగుతాయని వెదర్ మ్యాచ్ హెచ్చరించారు. ముఖ్యంగా మార్చి 3 నుండి 7 వరకు తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎండలు మండిపోతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో 39-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తెలంగాణలో హయ్యెస్ట్ టెంపరేచర్స్
హైదరాబాద్ లో కూడా ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరిగాయి... పగటివేళ వేడిగాలులు, ఉక్కపోతతో ప్రజలు సతమతం అవుతున్నారు. రాబోయే రోజుల్లో నగరంలో ఉష్ణోగ్రతలు 36 నుండి 39 డిగ్రీలు నమోదయ్యే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఇతర తెలంగాణ ప్రాంతాల్లోనూ సాధారణ వేసవి ఉష్ణోగ్రతలు 37 నుండి 39 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ కీలక ప్రకటన చేశారు.
రేపట్నుంచి భానుడి భగభగలు...
హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా మార్చి 3 నుండి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల,జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 36 నుండి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. మిగతా జిల్లాల్లో 36 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలే ఉంటాయట. ఇలా మార్చి 3,4,5 తేదీల్లో ఇదే వాతావరణం ఉంటుందట... అందుకే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
తెలంగాణలో హయ్యెస్ట్ టెంపరేచర్ ఇక్కడే
ఇక ఇప్పటికే తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... నిన్న (మార్చి1, ఆదివారం) నిజామాబాద్ లో ఏకంగా 36 డిగ్రీలు నమోదయ్యింది. అలాగే ఆదిలాబాద్ లో 35.8, భద్రాచలంలో 35.2, మహబూబ్ నగర్ లో 35.1, రామగుండంలో 34.6 డిగ్రీల హయ్యెస్ట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో అత్యధికంగా హకీంపేటలో 35.2 డిగ్రీలు నమోదయ్యింది.
ఏపీలో మండిపోతున్న ఎండలు
మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎండల తీవ్రత పెరుగుతోంది.. కొన్ని ప్రాంతాల్లో 35 నుండి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఐఎండి సూచనల ప్రకారం... ఈ 2026 వేసవి మార్చి నుంచి మే వరకు సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎండలనుండి కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
వేసవి జాగ్రత్తలు..
టోపి, కర్చీఫ్, తెలుపు రంగు కాటన్ వస్త్రాలను సిద్ధం చేసుకోవాలి.
మీ కళ్ళ రక్షణ కోసం మంచి సన్ గ్లాసెస్ ఉపయోగించాలి.
ఇంటి వాతావరణం చల్లదనం కోసం ఇంటి పైకప్పులపై వైట్ పెయింట్, కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్ ను వంటివి ఏర్పాటు చేసుకోవాలి.
మేడపైన మొక్కలు, ఇంట్లోని మొక్కలు (ఇండోర్ ప్లాంట్స్) భవనాన్ని చల్లగా ఉంచుతాయి. అదేవిదంగా ఉష్ణతాపాన్ని తగ్గిస్తాయి.
ఇంటి పరిసరాల్లో ఖాళీస్థలం ఉంటే మొక్కలు పెంచుకోవాలన్నారు.
వంటగది తలుపులు, కిటికీలను తీసివుంచి తగినంత గాలి వచ్చేవిదంగా చూసుకోవాలి.
అవసరం ఉంటేనే పగటిపూట బయటకు వెళ్లాయి. ఎలాంటి పనులున్నా ఉదయం, సాయంత్రం వేళల్లో చూసుకోవాలి.
ముసలివారు, చిన్నారులు ఎండలు, ఉక్కపోతకు మరింత జాగ్రత్తగా ఉండాలి.

