దారుణం.. కోతిని కుక్కలతో కరిపించి.. ఉరివేసి..
ఓ కోతి నీరు తాగేందుకు ప్రయత్నించి తొట్టెలో పడిపోయింది. దాన్ని పట్టుకున్న ఆ ముగ్గురు చెట్టుకు వేలాడదీశారు.
మనుషుల్లో మానవత్వం రోజు రోజుకీ తగ్గిపోతోందని ప్రతిసారి మనం అనుకుంటూనే ఉన్నాం. అయితే.. కేవలం ఎదుటివారికి సహాయం చేయలేని స్థితిలోని మనుషులు దిగజారారని ఇన్నాళ్లు భావించాం. కానీ.. అభం శుభం తెలియని మూగ జీవాన్ని అతి క్రూరంగా హింసించి చంపేత దారుణ స్థితిలో పడిపోయామని తాజా సంఘటన తెలియజేస్తోంది.
ఓ కోతిని అతి దారుణంగా హింసించారు. కుక్కలతో కరిపించి.. ఉరివేసి మరీ చంపేశారు. ఈ దారుణ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అమ్మపాలెంలోకి ఈ నెల 26వ తేదీన ఓ కోతి దండు వచ్చింది. వాటిని సాధు వెంకటేశ్వరరావు, జోసెఫ్ రాజు, గౌడెల్లి గణపతి కలిసి తరిమారు. ఆ క్రమంలో ఓ కోతి నీరు తాగేందుకు ప్రయత్నించి తొట్టెలో పడిపోయింది. దాన్ని పట్టుకున్న ఆ ముగ్గురు చెట్టుకు వేలాడదీశారు.
ఒక కోతిని చంపేస్తే మరోసారి కోతులు ఆ ప్రాంతానికి రావడానికి భయపడుతాయని.. దాన్ని చెట్టుకు ఉరేసి కుక్కలతో కరిపిస్తూ, కర్రలతో కొట్టి చంపారు. ప్రాణాల కోసం అది విలవిలలాడుతుంటే.. దానిని చూసి వారు రాక్షసానందం పొందారు. ఆ తరువాత శివారు ప్రాంతంలో కోతి మృతదేహాన్ని పడేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ఫారెస్ట్ అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు. కోతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. ఈ దారుణ ఘటనకు బాధ్యులైన సాధు వెంకటేశ్వరరావు, జోసెఫ్ రాజు, గౌడెల్లి గణపతిలను అరెస్ట్ చేశారు. విచారణ తరువాత ముగ్గురిపై కేసు నమోదు చేసి ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున జరిమానా విధించారు. అయితే ఇంతటి క్రూర ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.