Asianet News TeluguAsianet News Telugu

Amnesia Pub Rape Case : నిందితుల తల్లిదండ్రులకు నోటీసులు.. కారు డ్రైవర్, యజమానులపై కేసులు..

అమ్నీషియా పబ్ రేప్ కేసులో నిందితులు ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నించారని పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలుసని పోలీసులు అనుమానిస్తున్నారు. నివృత్తి కోసం నిందితుల తల్లిదండ్రులకు నోటీసులు పంపారు. 

Jubileehills Gang Rape : Notices to parents of accused, Cases against car driver, owners
Author
Hyderabad, First Published Jun 15, 2022, 6:44 AM IST

హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితులు నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆధారాలు చేరిపేసేందుకు ప్రయత్నాలు చేశారని పోలీసులు  సాక్ష్యాధారాలు సేకరించారు. పోలీసు కస్టడీలో భాగంగా నిందితులను మంగళవారం విచారించారు. ఈ క్రమంలోనే బాధితురాలితో పాటు  వారు ప్రయాణించిన ఇన్నోవా కారు పోలీసుల దృష్టిలో పడకుండా ప్రభుత్వ రంగసంస్థ చైర్మన్ కారు డ్రైవర్ కు అప్పగించారు. అతడు ఇన్నోవా కారును మొయినాబాద్ సమీపంలోని అజీజ్ నగర్ లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో నిలిపి వచ్చేసాడు.

ఆ వ్యవసాయ క్షేత్రం ప్రభుత్వరంగ సంస్థ చైర్మన్ దేనని నిందితులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. పోక్సో చట్టం ప్రకారం మైనర్లపై లైంగిక దాడులు జరిగినప్పుడు ఆ విషయం తెలిసీ... పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం నేరంగా పరిగణించిన పోలీసులు..  సాదుద్దీన్ సహా ఐదుగురు మైనర్ల తల్లిదండ్రులకు తాఖీదులు పంపారు. మెర్సిడెస్ బెంజ్, ఇన్నోవా కార్లను మైనర్లు నడిపినట్లు సాక్షాధారాలు లభించడంతో ట్రాఫిక్ శాంతిభద్రతల పోలీసులు కేసు నమోదు చేశారు.

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ : ముగిసిన ఐదుగురు మైనర్ల పోలీస్ కస్టడీ, జువైనల్ హోంకి తరలింపు

పార్టీలో బాలికలు, యువతులు..
అమ్నీషియా పబ్ లో మే 28న జరిగిన పార్టీకి 182 మంది హాజరు కాగా,  ఇందులో 70 మంది బాలికలు, యువతులు ఉన్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. 50 మంది బాలికలు, యువతులతో ఫోన్లో మాట్లాడి పబ్ లో ఏం జరిగింది? బాధిత బాలికను ఎవరైనా అల్లరి చేశారా?  ఆమె నృత్యం చేస్తున్నప్పుడు నిందితులు ఆమె వద్దకు వెళ్లారా? ఆమెతో సన్నిహితంగా మెలిగారా? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి పరోక్షంగా, ప్రత్యక్షంగా తెలిసిన 20 మంది సాక్షులను విచారించారు. కస్టడీకి తీసుకున్న నిందితుల్లో ఐదుగురు మైనర్ల విచారణ మంగళవారంతో ముగిసింది. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిందితులను అధికారి సుదర్శన్ విచారించారు.  నిందితులను కోర్టులో హాజరు పరచి అక్కడి నుంచి జువైనల్ హోంకు తరలిస్తామని తెలిపారు. టీఐపీ (టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్)కు  సంబంధించిన పిటిషన్పై కోర్టు అనుమతిస్తే.. ఒకటి రెండు రోజుల్లో కోర్టులో బాలిక నిందితులను గుర్తించే ప్రక్రియ చేపట్టనున్నారు.

అంతా గమనిస్తూనే..
సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు ఏం చేయనున్నారని తొలి రోజు నుంచే గమనిస్తున్నారని పోలీసులు తెలుసుకున్నారు.  జూబ్లీహిల్స్ పోలీసులకు బాలిక తండ్రి ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలుసుకున్న ఐదుగురు మైనర్లు పోలీసులకు దొరకకుండా పారిపోయారు. ఇదే విషయాన్ని వారు విచారణలో అంగీకరించారు. బంజారా హిల్స్లో ఉంటున్న ఒక నిందితుడి తల్లి అప్పటికే ఊటీలో ఉండగా అక్కడికి చేరుకున్నాడు. మరొకరు నెల్లూరు ప్రాంతంలోని దర్గాకు వెళ్లి పోలీసులకు చిక్కాడు. మరో ఇద్దరు మధ్యవర్తుల ఆధారంగా పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఏ-5గా ఉన్న మైనర్ గుల్బర్గా ప్రాంతంలో  చిక్కినట్లు సమాచారం.  

అత్యాచార ఘటన తర్వాత వీరు పారిపోయి ఉంటారని,  విషయం కుటుంబ సభ్యులకు తెలిసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. వీటిని నివృత్తి చేసుకునేందుకు సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. మరోవైపు అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయవద్దు అని బాధితురాలి తండ్రికి ఓ ఎమ్మెల్యే ఫోన్ చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో అలాంటిదేం లేదని పోలీసులు ఖండించారు.

Follow Us:
Download App:
  • android
  • ios