Telangana Cabinet Meeting: తెలంగాణ మంత్రివర్గ భేటీకీ ఈసీ నిరాకరణ.. మంత్రులంతా ఢిల్లీకి.. కారణమేంటీ?
Telangana Cabinet Meeting: తెలంగాణ మంత్రివర్గ భేటీకి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదా పడింది. శనివారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఈసీ అనుమతి ఇవ్వలేదు. అసలేం జరిగిందంటే..?
![Telangana Cabinet meeting cancelled due to lack of ECI approval KRJ Telangana Cabinet meeting cancelled due to lack of ECI approval KRJ](https://static-ai.asianetnews.com/images/01hhgtxg0rddjdn4ye10ew670m/thenaveena-1734604719056916710-01-jpg_363x203xt.jpg)
Telangana Cabinet Meeting: తెలంగాణ ప్రభుత్వానికి భారత ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి నేత్రుత్వంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి భారత ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు. దీంతో సమావేశాన్ని నిర్వహించలేకపోయారు. ఎన్నికల సంఘం అనుమతి కోసం సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు శనివారం సాయంత్రం వరకు వేచిచూసినా స్పందన లేదు. దీంతో మంత్రివర్గ భేటీ వాయిదా వేశారు.
లోక్సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి.. వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి మే 27న జరగనున్న ఉపఎన్నికల కారణంగా రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంది. దీంతో రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించేందుకు కేబినెట్ సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా ఎన్నికల సంఘం స్పందించలేదు. ముఖ్యమంత్రి మినహా చాలా మంది మంత్రులు ఈ మధ్యాహ్నం సచివాలయానికి చేరుకుని సాయంత్రం 7 గంటల వరకు ఎన్నికల సంఘం అనుమతి కోసం వేచి ఉన్నారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో రాత్రి 7 గంటల తర్వాత ముఖ్యమంత్రి మినహా మంత్రులు సచివాలయం నుంచి వెళ్లిపోయారు. దీంతో కేబినేట్ భేటీ వాయిదా పడింది.
ఎన్నికల సంఘం అనుమతి కోసం సోమవారం వరకు వేచి చూస్తామని కొందరు మంత్రులు తెలిపారు. అప్పటికీ స్పందన రాకపోతే.. కొందరు మంత్రులు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషనర్తో సమావేశమై కేబినెట్ సమావేశానికి అనుమతి కోరాలని ప్లాన్ చేశారు. వ్యవసాయ రుణాల మాఫీ, వరి సేకరణ, ఖరీఫ్ సీజన్ ప్రణాళిక, అకాల వర్షాల వల్ల పంటలు నాశనమవడంతోపాటు పలు కీలక అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం అవసరమని చెబుతున్నారు. అలాగే జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ వేడుకలు. రాష్ట్ర పునర్విభజనకు పదేళ్లు పూర్తి కావటంతో ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న అంశాలు, పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న కీలకమైన అంశాలను కేబినేట్ భేటీలో చర్చించాలని భావించారు.కానీ, ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది.