టీడీపీని వదిలిస్తే.. రూ.25కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు..మాజీ ఎమ్మెల్యే
టీడీపీని వీడి.. టీఆర్ఎస్ లో చేరితే రూ.25కోట్లు ఇస్తామని తనకు ఆఫర్ చేశారని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు
టీడీపీని వీడి.. టీఆర్ఎస్ లో చేరితే రూ.25కోట్లు ఇస్తామని తనకు ఆఫర్ చేశారని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ప్రస్తుతం మహాకూటమి టీడీపీ అభ్యర్థిగా తెలంగాణ ఎన్నికల్లో సండ్ర పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డబ్బు ఆశ చూపి పార్టీ మారాలని ఒత్తిడి తీసుకొచ్చినా, అక్రమ కేసుల్లో ఇరికించినా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పార్టీ వీడకుండా ప్రజాసేవకే అంకితమయ్యానన్నారు. రాష్ట్రంలో జలగం వెంగళరావు, ఎన్టీ.రామారావు, వైఎస్.రాజశేఖర్రెడ్డి, చంద్రబాబునాయుడులను ఆదర్శంగా తీసుకుని ప్రాంతాభివృద్దికి కృషి చేస్తున్నానన్నారు.
ప్రజాకూటమి అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో పొందుపరచిన అంశాలతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సండ్ర తెలిపారు. తనను మరోసారి సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.