అక్కడి వైద్యులు ముందుగా కరోనా టెస్ట్ చేయించాలని చెప్పడంతో సమీపంలోని ఓ ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లో కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. అప్పటికే తీవ్రమైన ఛాతీనొప్పితో బాధపడుతున్న రవికుమార్ ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిలో ఈ నెల 24న చేరి చికిత్స పొందుతూ 26న ఉదయం మృతి చెందాడు.
కరోనా వైరస్ మన దేశంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు కేసుల సంఖ్య వినే ప్రజలు తీవ్రంగా భయపడిపోతున్నారు. అయితే.. కరోనా సోకితే... ఆ వ్యక్తి ఎంత అవస్థ పడుతాడో ఇప్పుడు ప్రత్యక్షంగా చూశారు. తాజాగా.. ఓ యువకుడు కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోగా.. ప్రాణాలు పోయే చివరి గంటల్లో తాను పడుతున్న ఇబ్బందిని సెల్ఫీ వీడియోలో చిత్రీకరించాడు. ఆ వీడియో చూస్తే.. ఎవరికైనా కన్నీరు రావాల్సిందే. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బీజేఆర్నగర్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...
జవహర్నగర్ కార్పొరేషన్లో నివాసముండే వెంకటేశ్ గౌడ్ కుమారుడు రవికుమార్ (35) తన భార్య ఇద్దరు పిల్లలతో కలసి మల్కాజిగిరి నియోజక వర్గంలోని నేరేడ్మెట్ వినాయక్నగర్లో నివాసముంటున్నాడు. 6 నెలల క్రితమే దుబాయ్ నుంచి వచ్చాడు.
ఈ క్రమంలో లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నాడు. ఈ నెల 22న రవికుమార్కు తీవ్ర జ్వరం రావడంతో స్థానిక వైద్యుల సలహా మేరకు నిమ్స్కు వెళ్లాడు. అక్కడి వైద్యులు ముందుగా కరోనా టెస్ట్ చేయించాలని చెప్పడంతో సమీపంలోని ఓ ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లో కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. అప్పటికే తీవ్రమైన ఛాతీనొప్పితో బాధపడుతున్న రవికుమార్ ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిలో ఈ నెల 24న చేరి చికిత్స పొందుతూ 26న ఉదయం మృతి చెందాడు.
వైద్యులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. జవహర్నగర్ కార్పొరేషన్లోని బీజేఆర్నగర్కు మృతదేహాన్ని తీసుకొచ్చి ఖననం చేయించారు. అంత్యక్రియల్లో దాదాపు 30 మంది పాల్గొన్నట్లు సమాచారం. మరుసటిరోజు మృతుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ రిపోర్ట్ రావడంతో వైద్యులు, పోలీసులు మృతుడి కుటుంబసభ్యులను ఆదివారం క్వారంటైన్ చేశారు.
కాగా.. ‘డాడీ బై.. బై..! నాకు ఊపిరి ఆడక గుండె ఆగిపోయేలా ఉంది. వెంటిలేటర్ పెట్టమని బతిమిలాడినా డాక్టర్లు పట్టించుకోవడం లేదు..’ అంటూ అతను సెల్ఫీ వీడియో పంపడం గమనార్హం. ఆ వీడియో అందరి చేత కన్నీరు పెట్టించేలా ఉంది.
ఈ వీడియోపై వైద్యులు స్పందించారు. తాము అతనిని రక్షించేందుకు చాలా ప్రయత్నించామని.. వెంటిలేటర్ తీసేయలేదని చెప్పడం విశేషం.
