Asianet News TeluguAsianet News Telugu

Year Roundup 2019: పి‌వి సింధు టాప్, మెరిసిన క్రీడా రత్నాలు వీరే..

ఈ పదేండ్లలోనే టీమ్‌ ఇండియా అత్యుత్తమ విజయాలు నమోదు చేసింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌, జకర్తా ఆసియా క్రీడలు, ఢిల్లీ కామన్‌వెల్త్‌ క్రీడల్లో మెరుగైన మెడల్స్‌తో మెరిసింది. 

top best sports persons in 2019
Author
Hyderabad, First Published Dec 31, 2019, 2:11 PM IST

భారత క్రీడా రంగానికి 2010-2019 అత్యంత విజయవంతమైన దశాబ్దంగా చెప్పవచ్చు. ఈ పదేండ్లలోనే టీమ్‌ ఇండియా అత్యుత్తమ విజయాలు నమోదు చేసింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌, జకర్తా ఆసియా క్రీడలు, ఢిల్లీ కామన్‌వెల్త్‌ క్రీడల్లో మెరుగైన మెడల్స్‌తో మెరిసింది. 

జట్టుగా చిరస్మరణీయ విజయాలు సాధించిన భారత్‌.. వ్యక్తిగత విభాగాల్లోనూ గర్వించదగిన మైలురాయి ఘనతలు అందుకుంది. ఈ దశాబ్దంలోనే రెజ్లింగ్‌లో సుశీల్‌ కుమార్‌, బ్యాడ్మింటన్‌లో పి.వి సింధు ప్రపంచ చాంపియన్స్‌గా నిలిచింది ఈ దశాబ్దంలోనే. ఈ పదేండ్లలో ఎంతో మంది అథ్లెట్లు భారత్‌ గర్వించే విజయాలు సాధించారు. భారత క్రీడలకు సంబంధించి ఈ దశాబ్దపు 5గురు అత్యంత ప్రభావశీలురైన క్రీడాకారులను ఒకసారి చూద్దాం. 

also read బీచ్ లో ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న కేఎల్ రాహుల్...

గోల్డెన్‌ గర్ల్‌ పి.వి సింధు

2011 కామన్‌వెల్త్‌ యూత్‌ గేమ్స్‌, 2012 ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్స్‌ మెడల్స్‌తో పి.వి సింధు తనలో దాగిన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ సర్క్యూట్‌లో సింధు అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం 2013 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లోనే. 

డిఫెండింగ్‌ చాంపియన్‌, ఒలింపిక్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌ చైనా దిగ్గజం వాంగ్‌ యుహాన్‌ను మూడో రౌండ్లో మట్టికరిపించిన సింధు ఆ టోర్నీలో కాంస్య పతకం సాధించింది. చైనా స్టార్‌పై విజయంతో సింధు వెలుగులోకి వచ్చింది. అప్పట్నుంచి 2015లో మినహా ప్రతి ఏడాదీ వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో సింధు పతకం సాధించింది. ఈ దశాబ్దంలో ఐదు వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌ మెడల్స్‌తో సింధు అరుదైన రికార్డు వహించింది.

ఒలింపిక్స్‌లో తొలి ప్రయత్నంలోనే రజతం సాధించిన సింధు, ఆ విజయంతో భారతావనీ సూపర్‌స్టార్‌గా ఎదిగింది. ఒలింపిక్స్‌లో మెడల్‌ కొట్టిన యువ షట్లర్‌గా, సిల్వర్‌ సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణీగా ఘనత దక్కించుకుంది. 

ఈ ఏడాది ఆగస్టులో వరల్డ్‌ నం.1 తైజు యింగ్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ నవోమి ఒకుహరలను ఓడించిన సింధు వరల్డ్‌ చాంపియన్‌గా అవతరించింది. 2018లో వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ విజేతగా నిలిచిన సింధు.. వరుసగా ఏడు బిడబ్ల్యూఎఫ్ ఫైనల్స్‌ ఓటమికి చెక్‌ పెట్టింది. సిల్వర్‌ గర్ల్‌ ముద్రను చెరిపేసుకుని గోల్డెన్‌ గర్ల్స్‌గా నిరూపించుకుంది.

బాక్సింగ్ క్వీన్ మేరీకోమ్‌ : 

రెండు దశాబ్దాలుగా నిలకడగా వరల్డ్‌ స్పోర్ట్స్‌లో అగ్రశ్రేణి అథ్లెట్‌గా నిలిచిన అరుదైన ఘనత దక్కించుకున్న మణిపూర్‌ మణిపూస మేరీకోమ్‌. మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో 2002లో మొదలైన మేరీకోమ్‌ జోరు.. 2019లోనూ కొనసాగుతోంది. 

ఆరు స్వర్ణాలు, ఓ రజతం, ఓ కాంస్య పతకంతో వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో ఏకంగా ఎనిమిది మెడల్స్‌ కొల్లగొట్టిన మేరీకోమ్‌ ఆల్‌టైమ్‌ దిగ్గజంగా అవతరించింది. ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్‌కు అవకాశం కల్పించిన తొలి సీజన్‌లోనే లండన్‌ ఒలింపిక్స్‌లో మేరీకోమ్‌ కాంస్య పతకం సాధించింది. 

ఆసియా, కామన్‌వెల్త్‌ క్రీడల్లో ఈ దశాబ్దపు స్వర్ణాలు మేరీ ఖాతాలో పడిపోయాయి. 36 ఏండ్ల వయసు, ముగ్గురు పిల్లల అమ్మతనం మేరీకోమ్‌ బాక్సింగ్‌ పంచ్‌లో పస తగ్గించలేకపోయాయి. ఈ ఏడాది వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లోనూ మెడల్‌ కొట్టిన మేరీకోమ్‌.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతోంది.

సూపర్ సైనా : భారత బ్యాడ్మింటన్‌లో సింధు విశ్వరూపానికి ముందు వరకు నడిచిందంతా సైనా నెహ్వాల్‌ శకమే. ఈ దశాబ్దంలో చివరి ఐదేండ్లలో సైనా నెహ్వాల్‌ నుంచి చెప్పుకోదగిన విజయాలు తగ్గాయి. సైనా సమకాలీన షట్లర్లు అంతర్జాతీయ కెరీర్‌ నుంచి తప్పుకున్నా, ఈ హైదరాబాదీ ఇంకా పోరాడుతూనే ఉంది. 

లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం అందుకున్న సైనా నెహ్వాల్‌ ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్‌ షట్లర్‌గా నిలిచింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో వరల్డ్‌ నెంబర్1గా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణీగా సైనా చరిత్ర సృష్టించింది. 

ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రెండు పతకాలు (రజతం, కాంస్యం) సహా కామన్‌వెల్త్‌ క్రీడల్లో 2014, 2018లలో వరుసగా స్వర్ణాలు సాధించింది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో సింగిల్స్‌ విభాగంలో 2 పసిడి పతకాలు సాధించిన ఏకైక షట్లర్‌ సైనా నెహ్వాల్‌.

లాంగెస్ట్ కెరీర్ ని ఎలా కొనసాగించాలో ప్రపంచానికి ఓ బెంచ్‌ మార్క్‌ లా నిల్చింది నెహ్వాల్ సృష్టించింది. మహిళల సింగిల్స్‌లో సూపర్‌ సిరీస్‌ టైటిళ్ల పరంగా మన ఈ హైదరాబాదీ అమ్మాయి కంటే కేవలం మరో నలుగురు షట్లర్లు మాత్రమే ముందున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌ టాప్‌-10లో సైనా నెహ్వాల్‌ మాదిరి మరో క్రీడాకారిణి అత్యధిక కాలం నిలువలేదు. కొన్నేండ్లుగా గాయాలు, ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నప్పటికీ సైనా నెహ్వాల్‌ ఈ ఘనత వహించింది.

మల్ల యోధుడు సుశీల్‌ కుమార్‌ : ఈ పదేండ్ల కాలం సుశీల్‌ కుమార్‌కు మిశ్రమ అనుభవాలను మిగిల్చింది. తొలి ఐదేండ్లలో సుశీల్‌ కుమార్‌ రెండో ఒలింపిక్‌ మెడల్‌ కూడా సాధించి మరే ఇతర భారత అథ్లెట్‌ సాధించలేని ఘనత సాధించాడు. 

1952 తర్వాత ఏ భారత అథ్లెట్‌ కూడా రెండు ఒలింపిక్‌ పథకాలను సాధించలేదు. సుశీల్‌ కుమార్‌ మాత్రమే ఆ ఘనత సాధించాడు. 2010 మాస్కో వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో 66 కేజీల విభాగంలో కుస్తీ యోధుడుగా నిలిచాడు. ఈ దశాబ్దంలో జరిగిన ఆసియా క్రీడలు, కామన్‌వెల్త్‌ క్రీడల్లో స్వర్ణ పతకాలు గెల్చుకున్నాడు. ఆసియా చాంపియన్‌షిప్స్‌, కామన్‌వెల్త్‌ చాంపియన్‌షిప్స్‌లోనూ సుశీల్‌ కుమార్‌ గోల్డెన్ పెర్ఫార్మన్స్ రిపీట్ చేశాడు. 

రియో ఒలింపిక్స్‌ ముంగిట యువ రెజ్లర్‌ నర్సింగ్‌ యాదవ్‌తో ట్రయల్స్‌ వివాదం సుశీల్‌ కుమార్‌ ప్రతిష్టను మసకబార్చింది. రీ ఎంట్రీ ఇచ్చిన సుశీల్‌ కుమార్‌ ఒలింపిక్‌ అర్హత కోసం నాటకీయ పరిణామాల నడుమ నర్సింగ్‌ యాదవ్‌ను తప్పించాడనే విమర్శలు కూడా వచ్చాయి.

also read ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు

భారత ఫుట్ బాల్ ఆశాకిరణం ఛెత్రీ : 

క్రికెట్‌కు అలవాటు పడిన భారత క్రీడాభిమానులు సాకర్‌ స్టార్‌ సునీల్‌ ఛెత్రీని విస్మరించినా.. ప్రపంచ ఫుట్‌బాల్‌లో అతడి గణాంకాలు చరిత్రలో అతడి పేరును ఘనంగా లిఖించేలా చేశాయి. కెప్టెన్‌, నాయకుడు, దిగ్గజం, లీడర్, స్టార్ ఇవేవీ సునీల్‌ ఛెత్రీని పరిచయం చేసేందుకు సరిపోవు. భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన 82 మ్యాచుల్లో 53 గోల్స్‌ కొట్టాడు. మ్యాచ్‌, గోల్స్‌ శాతంలో దిగ్గజం లియోనల్‌ మెస్సీ కంటే ఛెత్రీ మెరుగైన ఆటగాడు. 

భారత్‌ 2019 ఎఎఫ్‌సీ ఆసియా కప్‌కు అర్హత సాధించేందుకు ఛెత్రీ కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో క్రిస్టియానో రొనాల్డో తర్వాత అత్యధిక గోల్స్‌ సాధించిన ఆటగాడిగా ఛెత్రీ రికార్డు నెలకొల్పాడు. బెంగళూర్‌ ఎఫ్‌సీ తరఫున ఛెత్రీ తన మెరుగైన ప్రదర్శన చేశాడు. బెంగళూర్‌ ఎఫ్‌సీకి రెండు ఐ లీగ్‌ టైటిళ్లు, ఓ ఐఎస్‌ఎల్‌ టైటిల్‌ అందించాడు. భారత్‌లో ఫుట్‌బాల్‌ ఆదరణ ఈ దశాబ్దంలో విప్లవాత్మక వృద్ది చెందింది. అందుకు సునీల్‌ ఛెత్రీ హీరోయిక్స్‌ ప్రధాన కారణం అని చెప్పడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios