కథువా, ఉన్నావ్ రేప్ కేసులు: మోడీకి అకడమిషియన్ల బహిరంగ లేఖ
కథువా, ఉన్నావ్ రేప్ కేసులు: మోడీకి అకడమిషియన్ల బహిరంగ లేఖ
న్యూఢిల్లీ: కథువా, ఉన్నావా రేప్ కేసులపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ సంఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 600 మందికి పైగా అకడమిషియన్లు ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. దారుణమైన పరిస్థితులకు ప్రభుత్వం బాధ్యత వహించాలని వారన్నారు. దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన సంఘటనలపై సుదీర్ఘ కాలం ప్రధాని మౌనం పాటించడంపై, బాధితులకు న్యాయం చేసే విషయంపై నిర్దిష్టమైన హామీ ఇవ్వకపోవడంపై వారు ఆక్షేపణ తెలియజేశారు. కథువా, ఉన్నావా సంఘటనలపై, ఆ తర్వాతి పరిణామాలపై తీవ్రమైన ఆగ్రహాన్ని తాము వ్యక్తం చేస్తున్నట్లు వారు తెలిపారు. నేరాలకు పాల్పడినవారిని రక్షించే యత్నాలు చేయడంపై వారు తీవ్రంగా స్పందించారు. బహిరంగ లేఖపై సంతకాలు చేసినవారిలో న్యూయార్క్ విశ్వవిద్యాలయం, ది బ్రౌన్ యూనివర్శిటీ, హార్వర్డ్, కొలంబియా తదితర విశ్వవిద్యాలయాలకు చెందిన అకడమిషియన్లు, స్కాలర్లు సంతకాలు చేశారు.