పంజాబ్ లో పాకిస్తాన్ డ్రోన్ డ్రగ్స్ సరఫరా: సీజ్ చేసిన బీఎస్ఎఫ్
పంజాబ్ రాష్ట్రంలోని ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో డ్రోన్ ను బీఎస్ఎఫ్ అధికారులు సోమవారంనాడు అర్ధరాత్రి కూల్చివేశారు. డ్రోన్ ద్వారా డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారని బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు.
న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్తాన్ సరిహద్దులో డ్రోన్ ను బీఎస్ఎఫ్ అధికారులు సోమవారం నాడు అర్ధరాత్రి కూల్చివేశారు. పంజాబ్ రాష్ట్రంలోని పాకిస్హాన్ సరిహద్దు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రోన్ ద్వారా పాకిస్తాన్ నుండి డ్రగ్స్ తరలిస్తున్నారని బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు. పాకిస్తాన్ వైపు నుండి అమృత్ సర్ సెక్టార్ లోని సరిహద్దు ప్రాంతంలోకి డ్రోన్ ప్రవేశించింది.అమృత్సర్ లోని ఛనా గ్రామ సమీపంలోని సరిహద్దులో విధుల్లో బీఎస్ఎఫ్ సిబ్బందికి సోమవారం నాడు డ్రోన్ కన్పించింది.వెంటనే బీఎస్ఎప్ సిబ్బంది డ్రోన్ పై కాల్పులు జరిపి కూల్చివేశారని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ డ్రోన్ లో 2.5 కిలోల నిషేధిత డ్రగ్స్ ను సీజ్ చేసినట్టుగా బీఎస్ఎఫ్ అధికారులు వివరించారు. సరిహద్దు వెంట డ్రోన్లు ఎక్కువగా కనపిస్తున్నాయని ఇటీవల శ్రీనగర్ లో నిర్వహించిన భద్రతా సమీక్ష సమావేశంలో అధికారలుు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకు వచ్చారు.
డ్రోన్ల ద్వారా ఇండియాకు పాకిస్తాన్ నుండి తుపాకులు,పేలుడు పదార్ధాలు తరలిస్తుండగా సరిహద్దు వద్ద విధులు నిర్వహిస్తున్న భద్రతా బలగాలు సీజ్ చేస్తున్నాయి.పంజాబ్ రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలను పెంచి పోషించేందుకు పాకిస్తాన్ నుండి డ్రోన్ ల ద్వారా ఆయుధాలు ,ఆర్ధిక సహాయం చేయడానికి డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆయుధాలు, పేలుడు పదార్ధాలను లష్కరే తోయిబా సంస్థ సరఫరా చేస్తుంది.డ్రోన్ కార్యకలాపాలను నిలిపివేయడానికి చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖసంబంధిత ఏజెన్సీలను ఆదేశించింది.