పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఓటర్లు రానున్న ఎన్నికల్లో మరోసారి అధికార తృణమూల్ కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు


కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఓటర్లు రానున్న ఎన్నికల్లో మరోసారి అధికార తృణమూల్ కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేల్లో కూడ టీఎంసీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని ప్రకటించాయి.

2014 పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని 42 ఎంపీ సీట్లలో టీఎంసీ 34 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలకు పరిమితమైంది. ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన సీపీఐఎం పార్టీకి కేవలం రెండు స్థానాలు మాత్రమే దక్కాయి. ఈ ఎన్నికల్లో టీఎంసీకి 40 శాతం, లెఫ్ట్‌ఫ్రంట్‌కు 30 శాతం, కాంగ్రెస్‌కు 10 శాతం, బీజేపీకి 17 శాతం ఓట్లు వచ్చాయి.

పార్లమెంట్ ఎన్నికలు జరిగిన రెండేళ్ల తర్వాత బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో మరోసారి టీఎంసీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేసింది. సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకొని పోటీ చేశాయి. బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది.

ఈ ఎన్నికల్లో టీఎంసీ ఓట్ల శాతం పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే 5 శాతం పెరిగింది. ఈ ఎన్నికల్లో టీఎంసీకి 45 శాతం ఓట్లు దక్కాయి. కాంగ్రెస్, సీపీఎం కూటమికి 38 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీకి గత పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే 7 శాతం ఓట్లు తగ్గాయి.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎం మధ్య పొత్తు ఉండకపోవచ్చనే ప్రచారం కూడ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయమై సీపీఐఎం జాతీయ మహాసభల్లో తీవ్ర చర్చ జరిగిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్, సీపీఎం మధ్య పొత్తు ఉంటే పురులియా, కుచ్ బీహార్, బారాసాత్, రాయ్ గంజ్, ముర్షీదాబాద్ ఎంపీ సెగ్మెంట్ల విషయాల్లో రెండు పార్టీలు గట్టిగా పట్టుపడే అవకాశాలు ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు అవకాశాలు ఉండకపోవచ్చని అంటున్నారు.

రాయ్‌గంజ్, మాల్దా దక్షిణ్, బహరంపూర్, జంగీపూర్, మాల్దా ఉత్తర్‌, ముర్షీదాబాద్ ఈ నియోజకవర్గాల్లో అధికార టీఎంసీ కంటే లెప్ట్‌ప్రంట్, కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉంది.

నార్త్ బెంగాల్‌లో మాత్రమే లెఫ్ట్, కాంగ్రెస్ కూటమి కలిస్తేనే టీఎంసీ కంటే ఆధిక్యంలో ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కోసం బీజేపీ, లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు పోటీపడుతున్నాయి.

రాష్ట్రాన్ని దశాబ్దాలపాటు పాలించిన లెఫ్ట్‌ఫ్రంట్ ఉనికిని చాటుకోవడానికి అవస్థలు పడుతోంది. బీజేపీ రాష్ట్రంలో పుంజుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 

బహరంపూర్, జంగీపూర్, మాల్దా దక్షిణ్, మాల్దా ఉత్తర్, ముర్షీదాబాద్, రాయ్‌గంజ్, అలీపూర్‌ద్వార్, భీర్‌భమ్, జుల్పాయ్‌గురి, కృష్ణానగర్, బర్దమాన్ పూర్చ, కుచ్ బీహార్, పురూలియా, డైమండ్ హార్బర్ ఎంపీ సీట్లలో టీఎంసీకి, లెఫ్ట్‌‌ఫ్రంట్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆధిక్యంలో ఉన్నట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు.

బెంగాల్ రాష్ట్రంలో ముస్లిం ఓటర్లు గణనీయంగా ప్రభావం చూపుతారు. సిటిజన్ షిప్ సవరణ చట్టంతో పాటు అసాం ఒప్పందం‌లు రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

గతంలో కంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ సీట్లను గెలుపొందేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే బీజేపీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో కాలమే తేల్చనుంది.