కాంగ్రెస్, ఎన్సీపీల కోటకు బద్దలు: బీజేపీ, శివసేన వ్యూహమిదే
పశ్చిమ మహారాష్ట్రలోని కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కంచుకోటను దెబ్బతీసేందుకుబీజేపీ, శివసేన కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.పశ్చిమ మహారాష్ట్రలో 9 ఎంపీ స్థానాలున్నాయి.
ముంబై: పశ్చిమ మహారాష్ట్రలోని కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కంచుకోటను దెబ్బతీసేందుకుబీజేపీ, శివసేన కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.పశ్చిమ మహారాష్ట్రలో 9 ఎంపీ స్థానాలున్నాయి. ఫూణె, మధ, సంఘ్లీ, సతరా, కొల్హాపూర్, హత్కంగ్లే , మావల్, సిరూర్ నియోజకవర్గాలు పశ్చిమ మహారాష్ట్రలో ఉన్నాయి.
ఫూణె, మధ, సంఘ్లీ, సతరా, కొల్హాపూర్, హత్కంగ్లే ఎంపీ స్థానాలకు ఏప్రిల్ 23వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 29వ తేదీన మావల్, సిరూర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
2014 ఎన్నికల్లో మోడీ హవా కొనసాగిన సమయంలో కూడ ఈ 9 ఎంపీ సీట్లలో బీజేపీ, శివసేన కూటమికి కేవలం మూడు సీట్లు మాత్రమే దక్కాయి. రెండు సీట్లు బీజేపీకి, ఒక్క సీట్లో శివసేన విజయం సాధించింది. ఈ ప్రాంతంలోని నాలుగు సీట్లలో ఎన్సీపీ, ఎన్సీపీకి మిత్రపక్షంగా ఉన్న స్వాభిమాని సేట్కారీ సంఘటన ఒక్క స్థానంలో విజయం సాధించింది.
ఈ ఎన్నికలు పవార్, మోహిత్- పాటిల్, దివంగత వసంతరావు దాదా పాటిల్ కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న ఈ కుటుంబాలు తమ ఆధిపత్యాన్ని నిలుపుకొంటాయా.. లేదా ఆ కుటుంబాల కంచుకోటలను బద్దలు కొట్టి బీజేపీ విజయం సాధిస్తోందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మనమడు పార్థ్ పవార్ మావల్ ఎంపీ స్థానం నుండి పోటీకి దిగుతున్నారు. బారామతి నుండి శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే పోటీ చేస్తున్నారు.
మావల్ ఎంపీ స్థానంలో శివసేన సిట్టింగ్ ఎంపీ శ్రీరంగ్ సి. బార్నేపై పార్థ్ పవార్ పోటీ చేస్తున్నారు. బారామతి ఎంపీ స్థానం నుండి శరద్ పవార్ ఏడు దఫాలు ఎంపీగా విజయం సాధించారు.ఇదే స్థానం నుండి అజిత్ పవార్ ఒక్క దఫా ఎంపీగా నెగ్గారు. సుప్రియా సూలే మూడో దఫా ఈ స్థానం నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు.
ఈ ప్రాంతంలో ఏప్రిల్ 10వ తేదీన మోడీ ఎన్నికల ప్రచార సభ చివరి నిమిషంలో రద్దైంది. వచ్చే వారంలో మోడీ ఎన్నికల ప్రచార సభ ఈ ప్రాంతంలో ఉండే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
శిరూర్ ఎంపీ స్థానం నుండి టీవీ నటుడు అమోల్ కోహ్లే ఎన్సీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. అమోల్ ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి శంభాజీ మహారాజ్గా ఆయనకు ప్రసిద్ది పొందారు.
కోహ్లే గతంలో శివసేనలో ఉండేవారు. ఆయన శివసేనను వీడి ఎన్సీపీలో రెండు మాసాల క్రితం చేరారు. సిరూర్ నుండి శివసేన తరపున కొనసాగుతున్న శివాజీరావు పాటిల్పై ఆమోల్ కోహ్లే పోటీకి దిగారు.
సంఘ్లీ ఎంపీ స్థానం నుండి వసంతరావు పాటిల్ మనమడు విశాల్ ప్రకాష్బాపు పాటిల్ ఎస్ఎస్ఎస్ టిక్కెట్టు పై పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ సంజయ్ కాకా పాటిల్ మరోసారి పోటీకి దిగుతున్నారు.
సతారా ఎంపీ స్థానం నుండి ఎన్సీపీ నుండి రెండు దఫాలు ఎన్నికైన ఉదయరంజే పి. బోస్లే ఛత్రపతి శివాజీ మహారాజ సంతతికి చెందినవాడు. ఆయనపై బీజేపీ అభ్యర్ధిగా నరేంద్ర అన్నేసాహెబ్ పాటిల్ పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో శివసేనలో ఉన్నారు.
మధ ఎంపీ స్థానంలో ఎన్సీపీ సిట్టింగ్ ఎంపీ విజయ్ సిన్హా మోహిత్ పాటిల్కు ఆయన తనయుడు రంజిత్సిన్హాకు టిక్కెట్టు ఇవ్వడానికి నిరాకరించారు.
ఫూణె ఎంపీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా రాష్ట్ర మంత్రి గిరీష్ బాపట్ పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో సిట్టింగ్ ఎంపీ అనిల్ షిరోల్ కు టిక్కెట్టు నిరాకరించడంతో గిరీష్ బాపట్ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ జోషీపై పోటీకి దిగుతున్నారు.
హత్కంగ్లే ఎంపీ స్థానం నుండి ఎస్ఎస్ఎస్ అభ్యర్ధిగా రెండు దఫాలు ఎంపీగా పనిచేసిన రాజు శెట్టి శివసేన అభ్యర్ధి ధైర్యషీల్ మానే పోటీకి దిగుతున్నారు. ధైర్యషీల్ మాజీ ఎన్సీపీ ఎంపీ నివేదిత మానే కొడుకు.
పశ్చిమ మహరాష్ట్రలో పలు షుగర్ మిల్స్ ఉన్నాయి. పూణె కల్చరల్ రాజధానిగా మహారాష్ట్రగా కొనసాగుతోంది. టెక్స్టైల్స్ పరిశ్రమలకు షోలాపూర్ ప్రసిద్ది చెందింది. సంగ్లి పసుపు పరిశ్రమకు పేరొందింది.