ఆ ఆరేళ్లలా కాదు... మరింత దూకుడుగా ముందుకు...: విజయశాంతి
తన ఆరేళ్ల కాంగ్రెస్ ప్రస్థానం గురించి ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి సోషల్ మీడియా వేదికన ఆసక్తికర కామెంట్స్ చేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా ఆరేళ్ల ప్రస్థానం పూర్తయిందంటూ ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి గుర్తుచేసుకున్నారు. ఆరేళ్ల క్రితం ఫిబ్రవరి 25వ తేదీన కాంగ్రెస్ అధ్యక్షురాలు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించారు. అయితే ఈ ఆరేళ్లలో నిర్మాణాత్మక ఉద్యమాలు చేశానని... ఇకపై కాస్త దూకుడు పెంచుతానని ప్రకటించారు.
అధికారిక పేస్ బుక్ పేజిలో విజయశాంతి పెట్టిన పోస్ట్ యధావిదిగా...
నిన్న ఫిబ్రవరి 25 కి కాంగ్రెస్ పార్టీలో నా ఆరు సంవత్సరాల ప్రస్థానం పూర్తయి... ఏడవ సంవత్సరం ప్రారంభం అవుతోంది. అండగా నిలిచిన ఏఐసిసి, పిసిసి మరియు సీఎల్పీ నేతలకు, కార్యకర్తలకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొదటి నుండి నిర్మాణాత్మకమైన ఉద్యమాలు అలవాటైన నా మనస్తత్వానికి, ప్రజా క్షేత్ర పోరాటాలలో మరికొంత దూకుడు అవసరమని అప్పుడప్పుడు అభిప్రాయం కలుగుతుంది. అధిష్టానం అనుమతించినా కూడా.. కొన్ని తెలియని కారణాలతో, గతంలో నా ప్రజాపోరాట యాత్రల కార్యాచరణలు రకరకాల మార్పులకు గురికావటం, రద్దు కావటం వంటివి సంభవించాయి. ఇవన్నీ ఒకసారి పునః సమీక్షించుకుని, ప్రజా సంక్షేమ ప్రాధాన్యతా పరమైన నిర్ణయాలను రూపొందించుకోవలసిన సమయంగా ఈ సందర్భాన్ని భావిస్తున్నాను.
విజయశాంతి,
తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్