Heavy Rains Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇక ఈ 9 జిల్లాల్లో వర్ష బీభత్సమే, బిఅలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం ఏర్పడే అవకాశాలుండటంతో ఈ రెండు రోజులు భారీ నుండి అతిభాారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Weather Update : ఇప్పటికే నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. దీనికి ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు తోడవడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వర్షాలు మరింత పెరుగుతాయని... ఇందుకు అనుకూలమైన వాతావరణం బంగాళాఖాతంలో సిద్దం అవుతోందని వాతావరణ శాఖ ప్రకటించింది. జూలై 23 లేదా 24 అంటే రేపు లేదంటే ఎల్లుండి బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు ప్రకటించారు. దీంతో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు.
బంగాళాఖాతంలో అల్పపీడనం
దేశవ్యాప్తంగా వర్షాలు జోరందుకున్నాయి... రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత మరింత పెరగనుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఇందుకు ఒడిశా, పశ్చిమ బెంగాల్ కు ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనమే కారణమని వెల్లడించింది. అల్పపీడనం బలపడుతూ ముందుకు సాగి దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలను కురిపిస్తుందని తెలిపింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది... తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.
తెలంగాణలో భారీ వర్షాలు
రుతుపవనాలు, ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం... వీటన్నింటి ప్రభావం తెలంగాణపై గట్టిగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. వీటి ప్రభావంతో జూలై 22, 23 తేదీల్లో అంటే ఇవాళ, రేపు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని... రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది.
భారీవర్షాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
ఈ వర్షాకాలంలో ఇప్పుడే భారీ వానలు మొదలయ్యాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచిస్తోంది. ఈమేరకు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు కొన్ని జాగ్రత్తలు సూచించింది.
1. వర్ష సమయంలో ఇంట్లోనే ఉండండి. అత్యవసరం అయితేనే వర్షంలో బయటకు వెళ్లాలి.
2. చెట్ల కింద వాహనాలను నిలపడం లేదంటే మీరే నిలబడటం చేయరాదు. చెట్లపైనే పిడుగులు ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయి, అంతేకాదు ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
3. వర్షాల సమయంలో రోడ్డుపై నీరు నిలిచివుంటుంది... కాబట్టి గుంతలు కనిపించవు. ఇలాంటి సమయంలో వాహనాలను జాగ్రత్తగా నడపాలి... లేదంటే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది.
4. నదులు, జలాశయాలు, వాగులు వంకలు, చెరువుల పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వరద ప్రవాహంతో ప్రమాదాలు జరుగుతాయి.
5. వాతావరణ శాఖ హెచ్చరికలు ఫాలో అవ్వాలి. భారీ వర్షాల సమయంలో అధికారుల సూచనలు పాటించాలి. అవసరం అయితే ఇంటిని వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి.
6. నగరాలు, పట్టణాల్లో వర్షాల కారణంగా తీవ్ర ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతుంటాయి. కాబట్టి ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలి.
7-days warnings for Telangana dated : 22.07.2026 pic.twitter.com/xofCaJ7NLh
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) July 22, 2026
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు..
అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. అలాగే మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 5 రోజులు మేఘావృతమైన వాతావరణం ఉంటుందని.. పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

