Morning Diet Tips: ఖాళీ కడుపుతో పొరపాటున కూడా తినకూడని 5 రకాల ఫుడ్స్ ఇవే!
ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. కొన్ని ఫుడ్స్ ని దూరం పెట్టడం కూడా అంతే అవసరం. ముఖ్యంగా పరగడుపున కొన్ని రకాల ఫుడ్స్ ని అస్సలు తీసుకోవద్దు అంటున్నారు డాక్టర్లు. అవేంటో? ఖాళీ కడుపుతో తింటే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

పరగడుపున తినకూడని ఫుడ్స్
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రోజూ ఉదయాన్నే పరగడుపున తినే ఫుడ్ మన శరీరంపై చాలా ప్రభావం చూపిస్తుంది. కొన్ని రకాల పుడ్స్ ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వాటిని పరగడుపున తినడం వల్ల కొన్ని సమస్యలు తప్పవని డాక్టర్లు చెబుతున్నారు. మరి వేటిని పొరపాటున కూడా ఖాళీ కడుపుతో తినకూడదు? తింటే ఏమవుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
పండ్లు
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ పరగడుపున పండ్లు తినడం కొందరికి మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. పండ్లల్లో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిని ఒక్కసారిగా పెంచుతుంది. ఫలితంగా శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే ఒక్కసారిగా శక్తి తగ్గుతుంది. దానివల్ల తలనొప్పి, అలసట వంటివి రావచ్చు. కొంతమందిలో గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి జీర్ణ సమస్యలు రావచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు ఉదయాన్నే పండు తినడం వల్ల షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండవని నిపుణులు చెబుతున్నారు.
పాలు
నిపుణుల ప్రకారం పరగడుపున పాలు తాగడం కూడా కొంతమందికి సమస్యల్ని కలిగించవచ్చు. గ్యాస్, కడుపు ఉబ్బరం, నొప్పి, అసిడిటీ వంటి సమస్యలు రావచ్చు. ఫుల్ క్రీమ్ మిల్క్ ఎక్కువగా తీసుకుంటే జీర్ణక్రియ స్లో అవుతుంది. దానివల్ల శక్తి స్థాయిలు తగ్గే అవకాశం ఉంది. పాలలోని ప్రోటీన్స్ కొంతమందికి అలెర్జీ, జలుబు, దగ్గు వంటి సమస్యలు కలిగించవచ్చు.
పుల్లని పండ్లు
పరగడుపున పుల్లని పండ్లు తినడం కొంతమందికి జీర్ణ సమస్యలను కలిగించవచ్చు. వీటిలో ఫైబర్, షుగర్, న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే వీటిని ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. గ్యాస్, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు.
కాఫీ, టీ
పరగడుపున కాఫీ, టీ తాగడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే కెఫిన్.. అసిడిటీ, అలసట, కడుపు నొప్పి వంటి సమస్యలకు దారితీయవచ్చు. కొంతమందిలో అయితే గుండె కొట్టుకునే వేగం పెరగవచ్చు. మరికొందరిలో వెంటనే శక్తి పెరిగినట్లు అనిపించి, ఆ వెంటనే అలసట, నీరసంగా అనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్
పరగడుపున కూల్ డ్రింక్స్, చాక్లెట్లు, బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఇవి ఎక్కువ చక్కెర, ఫ్యాట్, ప్రిజర్వేటివ్స్ ని కలిగి ఉంటాయి. అందువల్ల రక్తంలో షుగర్ ఒక్కసారిగా పెరుగుతుంది. తర్వాత ఒక్కసారిగా శక్తి తగ్గిపోతుంది. పొద్దున్నే కూల్ డ్రింక్స్ తాగితే కడుపులో మంట, ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. చాక్లెట్స్లో కెఫిన్ ఉంటుంది. దీనివల్ల కొందరిలో హార్ట్ బీట్ పెరగడం, తలనొప్పి వంటివి రావచ్చు. బిస్కెట్లు తింటే జీర్ణక్రియ స్లో కావడంతోపాటు కడుపు సంబంధిత సమస్యలు రావచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

