Breakfast: 15 రోజులు బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులుంటాయో తెలుసా?
ఉదయం బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిగా తినాలని ఆరోగ్య నిపుణులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. కానీ ఈ మధ్య చాలామంది బరువు తగ్గాలని లేదా టైమ్ లేక బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు. 15 రోజులపాటు బ్రేక్ఫాస్ట్ మానేస్తే శరీరంలో ఎలాంటి మార్పులుంటాయో ఇక్కడ చూద్దాం.

Skipping Breakfast Effects
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ మానేయడం మంచిదా? కాదా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఉదయం నిద్రలేచిన తర్వాత శరీరం గ్లూకోజ్ను శక్తిగా ఉపయోగించుకుంటుంది. రాత్రంతా ఏం తీసుకోరు కాబట్టి, ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం ద్వారా మెదడు, శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. కానీ వరుసగా 15 రోజులు బ్రేక్ఫాస్ట్ మానేస్తే మొదటగా అలసట వస్తుంది. కొందరిలో తలనొప్పి, చిరాకు, ఏకాగ్రత లోపం వంటివి కూడా కనిపించవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు వంటి మానసిక శ్రమ ఎక్కువగా చేసే వారికి ఉదయం ఆహారం లేకపోవడం వల్ల వారి పనితీరుపై ప్రభావం పడుతుంది.
బరువు పెరిగే అవకాశం..
నిపుణుల ప్రకారం ఉదయం అల్పాహారం తీసుకోకపోతే మధ్యాహ్నం లేదా సాయంత్రం ఎక్కువగా తినే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మొత్తం రోజులో తీసుకునే కేలరీలు తగ్గకపోగా మరింత పెరిగే ప్రమాదం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు అస్థిరంగా మారవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు బ్రేక్ఫాస్ట్ మానేయడం వల్ల గ్లూకోజ్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. అయితే నియంత్రిత పద్ధతిలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడవచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు.
ఈ సమస్యలు వచ్చే అవకాశం..
15 రోజుల పాటు బ్రేక్ఫాస్ట్ మానేసినప్పుడు శరీరం మొదట గ్లైకోజన్ నిల్వలను వినియోగిస్తుంది. తర్వాత కొవ్వు నిల్వలను శక్తిగా మార్చడం ప్రారంభిస్తుంది. ఇది కొంతమందిలో బరువు తగ్గడానికి సహాయపడవచ్చు. అయితే ప్రోటీన్ తక్కువగా తీసుకుంటే కండరాల మాస్ తగ్గే ప్రమాదం కూడా ఉంది. ఉదయం ఆకలి ఎక్కువగా ఉన్నవారు ఆ ఆకలిని నిరోధించడానికి కాఫీ లేదా టీపై ఆధారపడితే అసిడిటి, గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు.
దీర్ఘకాలంగా అల్పాహారం మానేయడం వల్ల జీవక్రియ మందగించవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ సమతుల్యతపై ప్రభావం పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. పీసీఓఎస్ లేదా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఆహార పద్ధతుల్లో మార్పులు చేయడానికి ముందు వైద్యుల సలహా కచ్చితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
వీరు తప్పక టిఫిన్ చేయాలి
ఉదయం సరైన పోషకాహారం లేకపోతే చిరాకు, ఆందోళన పెరిగే అవకాశముంది. పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు బ్రేక్ఫాస్ట్ తప్పక తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల మెదడు అభివృద్ధికి, చదువులో ఏకాగ్రతకు ఉదయం ఆహారం చాలా అవసరం. గర్భిణీలు ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండడం వల్ల బలహీనత రావచ్చు. అయితే ఆరోగ్యవంతులైన పెద్దవారు సమతుల్య ఆహారంతో, సరైన పద్ధతిలో ఉపవాసం పాటిస్తే పెద్ద సమస్యలు లేకపోవచ్చు.
ఈ సమస్యలు వస్తే..
నిపుణుల ప్రకారం బ్రేక్ఫాస్ట్ అందరికీ తప్పనిసరి కాదు. కానీ అది చాలామందికి ప్రయోజనకరం. బ్రేక్ఫాస్ట్ మానేయాలి అనుకుంటే ముందుగా ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయాలి. అలసట, తలనొప్పి, అధిక ఆకలి, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తే వెంటనే ఆ పద్ధతిని ఆపాలి. ఒకవేళ బరువు తగ్గడం లక్ష్యమైతే, కేవలం బ్రేక్ ఫాస్ట్ మానేయడం కంటే ఆహార నియంత్రణ, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నియంత్రణపై దృష్టి పెట్టడం మంచిది.

