Gold Price Hike: పసిడి ప్రియులకు భారీ షార్.. రూ.2లక్షలకు చేరువలో తులం బంగారం
Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మరోసారి షాకవ్వాల్సిందే. ఎందుకంటే పసిడి ధరలు మళ్లీ మరోసారి భారీ స్థాయికి చేరుకున్నాయి. గ్రాము ఏకంగా రూ.16 వేల మార్క్ను దాటేసింది. అటు వెండి కూడా వెనక్కి తగ్గడం లేదు.

రికార్డు స్థాయిలకు బంగారం ధర
ఈ ఏడాది ప్రారంభంలోనే బంగారం ధరలు భారీగా పెరిగి గ్రాము రూ.16 వేలకుపైగా నమోదయ్యాయి. అయితే ఆ తర్వాత కొంతకాలం మార్కెట్లో ఒడిదుడుకులు కనిపించాయి. ముఖ్యంగా జూన్లో ధరలు తగ్గడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. ఒక దశలో గ్రాము బంగారం ధర రూ.13 వేల స్థాయికి కూడా చేరింది.
కానీ జూలై నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్వల్పంగా మొదలైన ధరల పెరుగుదల.. ఆగస్టులో వేగం పుంజుకుంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా పసిడి ధరలు వరుసగా పైకి కదులుతున్నాయి. దీంతో ప్రస్తుతం బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయిలకు చేరువవుతున్నాయి.
రూ.1,63,970కు చేరిన పసిడి
తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర మరో రూ.880 పెరిగింది. దీంతో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర రూ.1,63,970కు చేరుకుంది. అంటే గ్రాము బంగారం ధర రూ.16,397గా ఉంది.
అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా పెరిగింది. 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.1,50,300కు చేరుకుంది. గ్రాము ధర రూ.15,030గా నమోదైంది. ఇక 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.12,293 వద్ద కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,64,120గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,50,450 వద్ద కొనసాగుతోంది.
దూసుకెళ్తున్న వెండి
ఇక వెండి ధరలు కూడా కొనుగోలుదారులకు భారీ షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ఒక్కరోజులోనే రూ.5 వేల పెరిగి రూ.2,75,000కు చేరుకుంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు, పెట్టుబడిదారుల ఆసక్తి, మార్కెట్లో డిమాండ్ వంటి అంశాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ధరలు ఇలా వరుసగా పెరుగుతుండటంతో పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం నగలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఖర్చు భారీగా పెరుగుతోంది.
మరి ఈ ధరల జోరు ఇక్కడితో ఆగుతుందా? లేక బంగారం మరింత పైకి వెళ్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

