టాలీవుడ్ కి సీఎం రేవంత్ రెడ్డి భారీ ఝలక్..!
తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ కి భారీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సూచనలు చర్చకు దారి తీశాయి.
![telangana cm revanth reddy key indications to tollywood ksr telangana cm revanth reddy key indications to tollywood ksr](https://static-ai.asianetnews.com/images/01hhgtxg0rddjdn4ye10ew670m/thenaveena-1734604719056916710-01-jpg_363x203xt.jpg)
హైదరాబాద్ డ్రగ్ మాఫియా అడ్డాగా మారింది. దాని మూలాలు టాలీవుడ్ లో కనిపిస్తున్నాయి. గత ఆరేడేళ్లలో పలువురు చిత్ర ప్రముఖులు డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కోవడం కలకలం రేపింది. 2017లో పెద్ద డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు చేసిన అధికారులు పూరి జగన్నాధ్, ఛార్మి, ముమైత్ ఖాన్, తరుణ్, రవితేజ, సుబ్బరాజు, తనీష్ తో పాటు మరికొందరు ప్రముఖులను విచారించింది. డ్రగ్ ఫెడ్లర్స్ తో వీరికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. 2021లో వీరిని మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలవడం జరిగింది.
నటుడు నవదీప్, తరుణ్, రానా, రకుల్ ప్రీత్ సింగ్ పలుమార్లు డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ అమ్ముతూ అడ్డంగా బుక్ అయ్యాడు. చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు, దర్శకులు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు కస్టమర్లు అయితే, మరికొందరు దందా చేస్తున్నారు. తెలంగాణాలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
టాలీవుడ్ పై కొరడా జులిపిస్తోంది. డ్రగ్ ఫ్రీ టాలీవుడ్ దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమ పెద్దలకు కీలక సూచనలు చేశారు. టికెట్స్ హైక్స్ కోసం ప్రభుత్వ అనుమతుల కోసం ప్రయత్నం చేసే దర్శక నిర్మాతలు, హీరోలు డ్రగ్స్ కి వ్యతిరేకంగా అవేర్నెస్ వీడియోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ వాడకం వలన కలిగే దుష్ప్రయోజనాలు తెలియజేస్తూ వీడియోలు బైట్ లు రూపొందించాలని, వారి చిత్రాలకే తెలంగాణ ప్రభుత్వం టికెట్స్ ధరలు పెంచుకుని అమ్ముకునే అనుమతులు ఇస్తుందని వెల్లడించారు.
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హీరో చిరంజీవిని ప్రశంసించారు. ప్రభుత్వం అడగకుండానే స్వచ్ఛంగా ముందుకు వచ్చి ఆయన డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా వీడియో చేశారని కొనియాడారు. చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉన్నవారిపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారనిపిస్తుంది.