13 ఏండ్లు పూర్తి చేసుకున్న ఎస్ఎస్ రాజమౌళి ఎపిక్ జర్నీ.. ‘మగధీర’ సెలబ్రేషన్స్..
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ ‘మగధీర’కు నేటితో 13 ఏండ్లు నిండాయి. ఈ సందర్భంగా ఫ్యాన్స్ వేడుకలు చేసుకుంటున్నారు.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఎపిక్ ఫిల్మ్ ‘మగధీర’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. సరిగ్గా 13 ఏండ్ల కింద జూలై 31న (ఇదే రోజు) ఈ చిత్రం రిలీజ్ అయ్యి టాలీవుడ్ లోని ఒక్కో రికార్డును బ్రేక్ చేసింది. కేవలం రూ. 40 కోట్లతో నిర్మించిన ఈ ఫాంటసీ ఫిల్మ్ రూ.150 కోట్ల మేర వసూళ్లను సాధించింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమను కొత్త మలుపు తిప్పింది. ఎస్ఎస్ రాజమౌళి కూడా ఇతిహాసాలవైపు తన కేరీర్ లో చేసిన మొదటి ప్రయత్నం ఇది. ఇక్కడి నుంచి రాజమౌళి రెండో దశ మొదలైందని చెప్పవచ్చు.
బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘మగధీర’ నుంచే రాజమౌళి ఎపిక్ జర్నీ మొదలై ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు. ‘బాహుబలి’, ‘బాహుబలి : కన్ క్ల్యూజన్’, ‘ఆర్ఆర్ఆర్’ తో బాక్సాఫీజ్ వద్ద రికార్డులను క్రియేట్ చేశారు. Baahubali తో ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రికార్డులు టాలీవుడ్ సొంతం అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన రెండో ఇండియన్ ఫిల్మ్ గా బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తర్వా త రీసెంట్ గా వచ్చిన RRR మూవీతోనూ బాక్సాఫీస్ వద్ద రికార్డులను నెలకొల్పారు. ఇండియన్ ఫిల్మ్ ను మరోస్థాయికి తీసుకెళ్లారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి ‘ఎస్ఎస్ఎంబీ29’ని డైరెక్టర్ చేయనున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఇప్పటికీ తెలుగు ఆడియెన్స్ ఇష్టపడుతూనే ఉంటారు. అలాగే చిత్రానికి ఎంఎం కీరవాణీ అందించిన అద్భుతమైన సంగీతం నేటికీ సంగీత ప్రియులను కదిలిస్తూనే ఉంది. ఈరోజు ‘మగధీర’ చిత్రానికి 13 ఏండ్లు నిండటంతో చిత్ర అభిమానులు, రామ్ చరణ్, కాజల్ అభిమానులు సోషల్ మీడియా వేదికన సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ పోస్ట్ లు పెడుతూ సినిమాపై ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు.