ఉగాదికి `ఆచార్య`.. మహేష్బాబుని ఢీ కొట్టబోతున్న మెగాస్టార్
`ఆచార్య`ని వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు శనివారం ప్రకటించారు. అభిమానులను డిజప్పాయింట్ చేశారు. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు.
సంక్రాంతి కానుకగా బ్యాడ్ న్యూస్ చెప్పిన `ఆచార్య` ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 4న విడుదల కావాల్సిన `ఆచార్య`ని వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు శనివారం ప్రకటించారు. అభిమానులను డిజప్పాయింట్ చేశారు. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 1న ఉగాది కానుకగా `ఆచార్య` సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆ లోపు కరోనా తగ్గుముఖం పడుతుందని ఆశిస్తుంది యూనిట్.
ఇదిలా ఉంటే శనివారం `ఆచార్య` టీమ్ కరోనా విజృంభన దృశ్యా సినిమాని వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. కరోనా మహమ్మారి సినిమాలకు పెద్ద శాపంగా మారిపోయింది. `కోవిడ్ విజృంభన కారణంగా ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితుల దృష్ట్యా `ఆచార్య` విడుదలని వాయిదా వేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి, కరోనా నియమాలను పాటించండి` అని పేర్కొంది యూనిట్. దీంతో మెగాస్టార్ అభిమానులు తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. ఇప్పటికే సంక్రాంతికి రావాల్సిన రామ్చరణ్ `ఆర్ఆర్ఆర్` వాయిదా వల్ల రాలేకపోయాడు, ఇక ఫిబ్రవరిలోనైనా మెగా హీరోలను చూడాలనుకున్న అభిమానులకు ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది.
ఇదిలా ఉంటే చిరంజీవి.. ఇప్పుడు మహేష్బాబుని ఢీ కొట్టబోతున్నారు. మహేష్బాబు నటించిన `సర్కారు వారి పాట` ఉగాది కానుకగా ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్టు గతంలో ప్రకటించారు. సంక్రాంతికి రావాల్సిన ఆ సినిమా కూడా `ఆర్ఆర్ఆర్`, `రాధేశ్యామ్` ల కోసం వాయిదా పడింది. సంక్రాంతికి పెద్ద సినిమాలు పోటీ పడొద్దని వాయిదా పడ్డ `సర్కారువారి పాట`కి చిరంజీవి పోటీ ఇవ్వడం గమనార్హం. అయితే ఈ రెండు లోకల్ మూవీస్ కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదనే టాక్ కూడా వినిపిస్తుంది. ఏదేమైనా ఇద్దరు పెద్ద స్టార్స్ సినిమాలు ఒకేరోజు రావడం ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. సంక్రాంతికి మిస్ అయిన ఆ పండగని ఉగాది చూడబోతున్నామని చెప్పొచ్చు.
చిరంజీవి, రామ్చరణ్ ఫస్ట్ వెండితెరపై కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామ్చరణ్, నిరంజన్రెడ్డి నిర్మాతలు. ఇందులో చిరు సరసన కాజల్, చరణ్కి జోడీగా పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. మరోవైపు మహేష్బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న `సర్కారువారిపాట` చిత్రంలో కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం మహేష్, కీర్తి కరోనా సోకడంతో హోం ఐసోలేషన్లో ఉన్న విషయం తెలిసిందే.