మహిళపై అత్యాచారయత్నం... నడిరోడ్డుపైనే మందుసీసాతో దాడి
ఒంటరి మహిళపై ఓ మృగాడు అఘాయిత్యానికి ప్రయత్నించడమే కాదు హత్యాయత్నానికి పాల్పడిన దారుణ సంఘటన నంద్యాలలో చోటుచేసుకుంది.
కర్నూల్: నంద్యాలలో దారుణం చోటుచేసుకుంది. ఒంటరి మహిళపై నడిరోడ్డుపైనే ఓ తాగుబోతు అత్యాచారం చేయడానికి ప్రయత్నించడమే కాదు తీవ్రంగా దాడిచేసి గాయపర్చాడు. దీంతో సదరు మహిళ ఆస్పత్రిపాలవ్వాల్సి వచ్చింది.
నంద్యాల బస్టాండ్ సమీపంలో లింగమ్మ అనే మహిళ ఒంటరిగా వెళుతుండగా ఓ వ్యక్తి తారసపడ్డాడు. అప్పటికే అక్కడ ఫుల్లుగా మద్యం సేవించివున్న అతడు ఆమెపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. చుట్టుపక్కల అందరూ చూస్తుండగానే అఘాయిత్యానికి ప్రయత్నించాడు.
అయితే లింగమ్మ అతన్ని ఎదురించే ప్రయత్నం చేసింది. దీంతో అతడు తన చేతిలోని బీరు సీసాతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆమెను అక్కడే వదిలేసి నిందితుడు అక్కడినుండి పరారయ్యాడు. స్థానికుల సాయంతో ఆమె స్థానిక ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతోంది.
ఈ దాడిలో గాయపడ్డ లింగమ్మది నంద్యాల సమీపంలోని గాజులపల్లి గ్రామం. బ్రతుకుదెరువు కోసం నంద్యాలలోనే నివాసముంటున్న ఆమెపై గతకొంతకాలంగా సుంకన్న అనే వ్యక్తి కన్నసినట్లు సమాచారం. ఇప్పుడు కూడా ఆమెపై అత్యాచారయత్నం, దాడి చేసింది కూడా అతడేనని తెలుస్తోంది.
నిందితుడు సుంకన్న మహిళలను ట్రాప్ చేసి వారి నుండి డబ్బులు దండుకోడమే ప్రవృత్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో లింగమ్మపై దాడి చేసినట్లు తెలుస్తోంది.