జగన్ పై రాళ్లదాడి పక్కా ప్లాన్ ప్రకారమేనా? ఎలా జరిగింది? పోలీసులు ఏమంటున్నారు? వీడియో దృశ్యాలు
YS Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రాళ్లదాడితో ఆయన ఎడమ కంటికి గాయం అయింది. కను బొమ్మపై బలంగా రాయి తగలడంతో గాటు పడింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
![Is the stone attack on YS Jagan Mohan Reddy a well-planned one? How did it happen? What do the police say? Here are the video scenes RMA Is the stone attack on YS Jagan Mohan Reddy a well-planned one? How did it happen? What do the police say? Here are the video scenes RMA](https://static-ai.asianetnews.com/images/01hvc40nvh03e8bgyyn7rqeyzy/hth-jpg_363x203xt.jpg)
YS Jagan Mohan Reddy : విజయవాడలో బస్సుయాత్ర సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి పై కొందరు ఆగంతకులు రాళ్లు విసరడం కలకలం రేపింది. బస్సు యాత్ర ఘనంగా సాగుతున్న సమయంలో పార్టీ శ్రేణులు పూల వర్షం కురిపించాయి. ఇదే సమయంలో కొందరు దుండగులు రాళ్లను కూడా విసిరారు. దీంతో జగన్ కంటిపై గాయాలు అయ్యాయి.
జగన్ పై రాళ్లదాడి ఎలా జరిగింది?
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైకాపా బస్సు యాత్రను చేపట్టింది. ఈ నేపథ్యంలోనే శనివారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్రలో పాలుపంచుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. విజయవాడలో బస్సుయాత్రను ప్రారంభించారు. దీనికి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు వచ్చారు. జగన్ పై కార్యకర్తలు పూల వర్షం కురిపిస్తూ.. పెద్ద పూలదండను జగన్ కు వేశారు. కార్యకర్తలు జగన్ పై పూలు జల్లుతున్నారు. అంతలోనే గుర్తుతెలియని దుండగులు జగన్ పైకి రాళ్లు విసరడంతో ఆయన గాయపడ్డారు.
జగన్ పై రాళ్ల దాడి పక్కా ప్లాన్ ప్రకారమేనా?
విజయవాడలో వైకాపా బస్సు యాత్ర సందర్భంగా జగన్ పై రాళ్లదాడి జరిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జగన్ పై రాళ్ల దాడి జరిగిన సమయంలో.. అంతకుముందు చోటుచేసుకున్న పలు ఘటనలు, దాడి జరిగిన ప్రాంతం విషయాలను గమనిస్తే జగన్ పై పక్కా ప్లాన్ ప్రకారమే ఇలా దాడి చేయడానికి కుట్ర పన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే దాడి జరగడానికి ముందు, దాడి జరిగిన సమయంలో కరెంట్ సరఫరా కొద్ది సమయం నిలిచిపోయింది. అలాగే, దాడి జరిగిన ప్రాంతంలో ఒక వైపు పాఠశాల భవనం ఉంది. మరోవైపు పెద్ద భవనాలు ఉన్నాయి. పాఠశాల భవనం పక్కనుంచే రాళ్లు విసిరినట్టు అనుమానిస్తున్నారు. పోలీసులు అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు.
రాళ్లదాడిపై వైకాపా శ్రేణుల మండిపాడు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాళ్లదాడి ఘటనపై ఆ వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. కావాలనే కుట్రపూరితంగా జగన్ పై దాడి చేశారని ఆరోపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ (టీడీపీ)ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి. జగన్ బస్సు యాత్రలో పెద్ద సంఖ్యలో జనాలను చూసిన టీడీపీ వర్గాలే ఇలాంటి రాళ్లదాడికి పాల్పడ్డాయని వైఎస్ఆర్సీసీ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
సీఎం జగన్ పై రాళ్లదాడి.. కంటిపై గాయం.. వీడియో