ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య, బాలిక వయసు 14 ఏళ్లు...
కర్నూల్ జిల్లా ఆత్మకూరులో విషాదం...
ప్రేమంటే ఏంటో తెలియని వయసులో ఆకర్షనకు లోనయ్యారు. దాన్నే ప్రేమగా భావించారు. అయితే తల్లిదండ్రులు ఎక్కడ తమ ప్రేమను అంగీకరించకుండా పెళ్లి చేయరేమోనని భయపడి దారుణానికి ఒడిగట్టారు. ఇద్దరూ కలిసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో జరిగింది.
కర్నూల్ జిల్లా నూతనపల్లె కు చెందిన వెంకటేష్ గౌడ్ అనే తాపి మేస్త్రి వద్ద జయరాయుడు అనే 20 ఏళ్ల యువకుడు సహాయకుడిగా పనిచేసేవాడు. వెంకటేష్ గౌడ్ కు అనిత అనే 14 ఏళ్ల కూతురు ఉంది. అయితే జయరాయుడు, అనితలు తరచూ కలుస్తుండటంతో సాన్నిహిత్యం పెరిగింది. దీంతో వారు ఆకర్షణకు లోనయ్యారు.
తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించరని భావించిన వీరు ఇంట్లోంచి పారిపోయారు. ఇద్దరూ కలిసి నేరుగా ఆత్మకూరుకు చేరుకున్నారు. అక్కడ ఓ పాడుబడిన భవనంలోకి వెళ్లి అక్కడ మరుగుదొడ్డి తలుపుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
అయితే భవనం లోకి అనిత, జయరాముడు వెళ్లడాన్ని గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకుని ఆ భవనం లో వెతకగా వెనుకవైపు ఇద్దరు ఉరేసుకుని చనిపోవడాన్ని గమనించారు. దీంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.