బాబు అడిగితే రైల్వేజోన్, స్టీల్ఫ్లాంట్ ఇవ్వం: సోము వీర్రాజు
బాబుపై షాకింగ్ కామెంట్స్ చేసిన చేసిన సోము వీర్రాజు
అమరావతి: నాలుగేళ్ల కాలంలో ఏపీలో బీజేపీ చేసిన అభివృద్ధిపై సీఎం చంద్రబాబునాయుడితో చర్చించేందుకు తాను సిద్దంగా ఉన్నానని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు.
శుక్రవారం నాడు ఆయన తూర్పు గోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడారు. అవినీతి పరులకు సహకరించబోమని ప్రధానమంత్రి మోడీ ఎప్పుడో చెప్పారని సోము వీర్రాజు గుర్తు చేశారు.
కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఉద్యమం చేస్తున్నవారు రాష్ట్రంలో మూతపడిన సంస్థలను ఎందుకు తెరిపించలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీపై దాడులు, ధర్మపోరాటాలను మానుకోవాలని టీడీపీ నేతలకు సోము వీర్రాజు హితవు పలికారు. చంద్రబాబునాయుడు అడిగితే ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వేజోన్ ఇవ్వమని సోము వీర్రాజు చెప్పారు. చంద్రబాబునాయుడు తాటాకు చప్పుళ్లకు భయపడమని ఆయన చెప్పారు.
కేంద్రం నుండి వచ్చిన నిధులతో రాష్ట్రమే అభివృద్ధి చేసినట్టుగా టీడీపీ నేతలు ప్రచారం చేసుకొంటున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాల్లో అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు.