
కూటమి పాలనలో నవ మాసాలు నవ మోసాలే: YSRCP MLC వరుదు కళ్యాణి
ఎన్నికలకు ముందు ఓట్ల కోసం కూటమ పార్టీలు మహిళలకు ఇచ్చిన హామీల అమలు ఏమయ్యిందని వైయస్ఆర్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... "రాష్ట్రంలో మహిళ భద్రతను కూటమి గాలికి వదిలేసింది. జగన్ గారి కంటే ఎక్కువ మేలు చేస్తామంటూ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించి, వాటిని ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రభుత్వం మహిళలను నిలువునా నట్టేట ముంచింది. మహాశక్తి పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పటి వరకు ఒక్క మహిళకు కూడా ఈ పథకం కింద మేలు జరగలేదు. ఉచిత బస్సు అంటూ పెద్ద ఎత్తున ఊదరగొట్టారు. రాష్ట్రంలోని అన్ని పుణ్యక్షేత్రాలు ఉచితంగా బస్సులో తిరగవచ్చంటూ ఊరించారు. ఎన్నికలకు ముందు పొరుగు రాష్ట్రాలను చూసి ఉచిత బస్పు హామీ ఇచ్చారు. ఆయా రాష్ట్రాల్లో వారు అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ను అమలు చేస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం హామీలు ఇవ్వడం, అధికారం లోకి రాగానే వాటిని విస్మరించడం అలవాటుగా మారింది. నిరుద్యోగులకు భృతి, ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేశారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ మహిళలకు యాబై ఏళ్ళకే పెన్షన్ అన్నారు. దానీ ఊసే లేదు. దేశ చరిత్రలోనే తొలిసారి డ్రాప్ అవుట్స్ ను ఆపేందుకు వైయస్ జగన్ గారు అమ్మ ఒడి అనే పథకాన్ని అమలు చేశారు. తల్లికి వందనం పేరుతో ఆ పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం కనీసం బడ్జెట్ లో అందుకు అవసరమైన నిధులను కూడా కేటాయించడం లేదు. రాష్ట్రంలో దాదాపు 83 లక్షల మంది పిల్లలు ఈ పథకం అమలు కోసం ఎదురుచూస్తున్నారు. చివరికి ఉద్యోగులకు, వాలంటీర్లను మోసం చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది" అని విమర్శించారు.