అప్పుడు నా వయస్సు నిండా పదహారే: భూ కుంభకోణంపై రేవంత్ రెడ్డి
తనపై వచ్చిన గోపనపల్లి భూకుంభకోణం ఆరోపణలపై తెలంగాణ కాంగ్రెసు ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. రికార్డులు తారుమారు చేసినట్లు చెబుతున్న 1978లో తనకు పదహారేళ్ల వయస్సు కూడా లేదని రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు సమీపంలోని గోపనపల్లి భూ వివాదంపై కాంగ్రెసు మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తాను ప్రజల తరఫున మాట్లాడితే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ఎక్కడో కాలుతోందని ఆయన బుధవారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
గోపనపల్లిలో 1978లో రికార్డులు తారుమారు చేసి తాను భూమి కొన్నట్లు ఆరోపిస్తున్నారని, అప్పుడు తన వయస్సు 16 ఏళ్లు మాత్రమేనని, ఆ వయస్సులో గోపనపల్లి ఎక్కుడుందో కూడా తనకు తెలియదని ఆయన అన్నారు.
Also Read: రేవంత్ కు గోపనపల్లి భూముల ఉచ్చు: వెనుక కథ ఇదీ...
ఆస్తులను లిటిగేషన్ లో పెడితే రేవంత్ లొంగుతాడని భావిస్తున్నారని, తన ఆస్తులన్నీ పోయినా కూడా చివరి శ్వాస వరకు కేసీఆర్ పై పోరాడుతూనే ఉంటానని ఆయన అన్నారు. తాను తలపెట్టిన పట్నం గోస రద్దు చేసుకోవాలని చిల్లర వ్యవహారాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత కేటీఆర్, రామేశ్వర రావు అక్రమాలు బయటపెడుతానని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం పెట్టే కేసులు తనకు గౌరవమని, కేసీఆర్పై పోరాటానికి గుర్తింపు అని ఆయన అన్నారు. ఈ కేసుల వల్ల తనకు లాభమే గానీ నష్టం లేదని ఆయన అన్నారు.
Also Read: రేవంత్ రెడ్డి కోసం రికార్డుల తారుమారు: డిప్యూటీ కలెక్టర్ సస్పెన్షన్