డెంగ్యూపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం డెంగ్యూపై యుద్ధం ప్రకటించింది. రాష్ట్రంలో డెంగ్యూ, సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సోమవారం వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, పురపాలక, ఐటీ శాఖమంత్రి కేటీ రామారావులు కలిసి రాష్ట్ర వైద్య, ఆరోగ్య, మున్సిపల్ శాఖ అధికారులతో జూమ్ లో సమీక్షసమావేశాన్ని నిర్వహించారు.
తెలంగాణ ప్రభుత్వం డెంగ్యూపై యుద్ధం ప్రకటించింది. రాష్ట్రంలో డెంగ్యూ, సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సోమవారం వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, పురపాలక, ఐటీ శాఖమంత్రి కేటీ రామారావులు కలిసి రాష్ట్ర వైద్య, ఆరోగ్య, మున్సిపల్ శాఖలతో జూమ్ లో సమీక్షసమావేశాన్ని నిర్వహించారు. ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఆరోగ్య శాఖ GHMC పరిధిలోని ప్రాంతాలతో సహా తెలంగాణలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించాలని సూచించారు. వీలైనంత ఎక్కువ మంది వ్యక్తులకు బూస్టర్ డోస్ వేయాలని నిర్ణయించారు.
ఈ సందర్బంగా.. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయనీ, ప్రతీ ఐదేళ్లకు ఒక సారి డెంగ్యూ కేసులు పెరుగుతుంటాయనీ, ఇది ఐదో సంవత్సరం కాబట్టి.. డెంగ్యూ కేసుల్లో కొంచెం పెరుగుదల కనిపిస్తుందని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్య, ఆరోగ్య, పురపాలక, పంచాయతీ శాఖ లు కలిసి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో జులై నెలలో 542 డెంగ్యూ కేసులు ఉంటే.. ఆగష్టులో ఆ కేసుల సంఖ్య 1827 కు చేరిందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలనీ, డెంగ్యూను కారకమైనది మంచి నీటి దోమలు .. పగటి పూటనే కుడతాయనీ, తొట్టిలో, కొబ్బరిచిప్పలు, పాత టైర్లు వంటి వాటిలో పెరుగుతాయని తెలిపారు.
జీహెచ్ఎంసీలో 1600 మంది ఎటమాలజీ స్టాప్ ఉన్నారనీ, వీరితో పాటు వైద్య ఆరోగ్య సిబ్బంది కలిసి ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజలకు చైతన్యపర్చాలని సూచించారు. ఈ క్రమంలో ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం అయి.. వారి సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని అన్నారు.
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా.. పదివేల బ్లడ్ యూనిట్లు సేకరించామనీ, ప్లెట్స్ లేట్స్ సపరేటర్ మిషన్లు అందుబాటులో ఉంచామనీ, ఎంత బ్లడ్ అవసరమైన ఉచితంగా ఇచ్చేందుకు వైద్యఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు. ప్రతీ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో వైద్యులు, మందులు, ఎక్విప్మెంట్ సిద్ధంగా ఉందని తెలిపారు.
సెప్టెంబర్ 17 న హైదరాబాద్, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా.. వెంటనే జ్వరపీడితులు బస్తీ దవాఖానాకు వచ్చి పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. డెంగ్యూ కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని వైద్య సిబ్బంది డోర్ టు డోర్ జ్వర సర్వే నిర్వహించాలని, టీ డయాగ్నసిస్ ద్వారా ఉచితంగా పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స అందిస్తామని తెలిపారు.
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు ఆందోళన చెందవద్దనీ, డెంగ్యూ కేసుల నిర్థారణకు ర్యాట్ కిట్స్ బస్తీ దవాఖానాల్లో అందుబాటులో ఉంచామనీ, జ్వరం వస్తే వెంటనే బస్తీ దవాఖానాల్లో వెళ్లి చికిత్స చేయించుకోవాలని టి డయాగ్నోసిస్ ద్వారా ఉచితంగా పరీక్షలు చేసి వైద్యం అందింస్తామని తెలిపారు.
బస్తీ దవాఖానాల ఏర్పాటు వల్ల ఫీవర్ ఆసుపత్రికి, గాంధీ ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య తగ్గిందని, ఫీవర్, గాంధీ, ఉస్మానియా, నీలోఫర్లలో బ్లడ్ సపరేటర్స్ ఉన్నాయని, బ్లడ్ విషయంలో ఇబ్బంది లేదని తెలిపారు. ఈ ఫీవర్ సర్వేతో పాటు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గత మూడేళ్లలో ప్రతీ ఆదివారం పది గంటలకు పది నిముషాలు ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమం బాగా చేశామని,
హెల్త్ డిపార్ట్మెంట్ , పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది కలిసి పని చేస్తే.. చక్కటి ఫలితాలు వస్తాయన్న మంత్రి హరీశ్ రావు మాటకు ఏకీభవిస్తున్నానని అన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్లు, జోనల్, డిప్యూటీ కమిషనర్లు ఏయే వార్డుల్లో డెంగ్యూ కేసులు ఎక్కువ ఉన్నాయో.. పరిశీలించి.. వారణకు ప్రత్యేక ప్రణాళిక తయారుచేయాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లోనూ ప్రణాళిక తయారు చేయాలనీ, ఆదివారం పది గంటలకు పది నిముషాలు ఇంటిని శుభ్రపరిచే కార్యక్రమం చేయాలని, ఈ కార్యక్రమంలో చిన్న పిల్లలను, మహిళలను భాగస్వామ్యం చేయాలని, మెప్మాను ఈకార్యక్రమంలో వినియోగించాలని సూచించారు.
విద్యార్థులు, ప్రిన్స్ పాల్స్, టీచర్లు అందరూ పాల్గొని సామాజిక బాధ్యతగా పని చేసేలా కార్యక్రమాలు రూపొందించాలనీ, ఈ కార్యక్రమంలో పాల్గొనే ఇళ్లకు స్టిక్కర్స్ అంటించాలని అధికారులకు సూచించారు.
డెంగ్యూ దోమలు మురికి నీళ్లలో కాకుండా మంచి నీటిలో ఉంటుందనీ, వర్షం లేదా ట్యాప్ లలో నుండి వచ్చే నీటిలోనూ ఈ వ్యాధిని కలిగించే దోమలు పెరుగుతాయని అన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్, మున్సిపల్ డిపార్ట్మెంట్, మెప్మా, విద్యార్థులు, పిల్లలను , ప్రజా ప్రతినిధులను , స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సెలబ్రిటీలను వినియోగించుకోవాలనీ, రేడియో, లోకల్ టీవీలు, హోర్డింగ్స్ వంటివి పెట్టి ప్రజలను చైతన్యపర్చాలని అన్నారు. డిజిటల్ మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అన్నారు.
పోలీసులు కార్డన్ సెర్చ్ చేసినట్లు జీహెచ్ఎంసీ పరిధిలోని కాలనీలన్నింటిలో జ్వర సర్వే నిర్వహించాలనీ, జీహెచ్ఎంసీ ఎటమాలజీ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రం దిగ్విజయం చేయాలని సూచించారు. హైదరాబాద్ సహా జిల్లాల్లోని డెంగ్యూ కేసులున్న పట్టణ ప్రాంతాల్లోనూ జ్వర సర్వే పక్బందింగా ఉద్యమంలా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ జూమ్ సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ కమిషనర్ శ్వేత మహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్, డెరక్టర్ హెల్త్ శ్రీనివాస రావు, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.