German company invest: తెలంగాణలో జర్మనీ కంపెనీ భారీ పెట్టుబడి
జర్మనీకి చెందిన Liteauto GmbH అనే కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. కేటీఆర్ సమక్షంలో ఆ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ కంపెనీ రూ. 1500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో దాదాపు 9 వేల మందికి ప్రత్యక్షంగా, 18 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.
Telangana an MoU with the German company : తెలంగాణలో పరిశ్రమలు నెలకొల్పేందుకు దేశ, విదేశీ సంస్థలు క్యూ కడుతున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు పరిశ్రమలు, సంస్థలు స్థాపించేందుకు ప్రముఖ బహుళ జాతీయ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. గత నాలుగు యేండ్లలో పారిశ్రామిక రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధించింది. పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విషయంలో సరళీకరణ విధానాలను అవలంభిస్తోంది టీ సర్కార్. ఈ క్రమంలో టిఎస్ ఐపాస్ను ఏర్పాటు చేయడంతో ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాల చూపు తెలంగాణపై పడుతోంది.
తాజాగా.. జర్మనీకి చెందిన Liteauto GmbH అనే కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. జర్మనీ అంబాసిడర్ వాల్టర్ జే లిండర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో Liteauto GmbH కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నది. రూ.1500 కోట్లతో 100 ఎకరాల్లో ఆటో మొబైల్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో జర్మన్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగింది. దీంతో దాదాపు తొమ్మిది వేల మందికి ప్రత్యక్షంగా, 18 వేల మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు.
ఈ కంపెనీ కార్లు, కామర్షియల్ వాహనాలు, ద్విచక్ర వాహనాలకు సంబంధించిన మెగ్నిషీయం భాగాలను ఉత్పత్తి చేయనుంది. హైదరాబాద్లోని తాజ్కృష్ణ హాటల్లో జరిగిన జర్మనీ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా Lite Auto GmbH డైరెక్టర్ బాలాఆనంద్ మాట్లాడారు. త్వరలోనే Lite Auto GmbH సంస్థ పూర్తి స్థాయిలో తన కార్యక్రమాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఐదేండ్లలో 200 మిలియన్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ పారిశ్రామిక రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధించిందనీ, రాష్ట్ర పారిశ్రామిక విధానం చాలా సరళీకృతమైందనీ, ఈ క్రమంలో టీఎస్ ఐపాస్ను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాల చూపు తెలంగాణపై పడుతోందని తెలిపారు.
ఈ క్రమంలో జర్మనీ పెట్టుబడులకు టీ సర్కార్ ఆహ్వానిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు 2 వేల ఎకరాల స్థలం అందుబాటులో ఉందని, పరిశ్రమలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు జర్మనీ రూపొందించిన విధివిధానాలు బాగున్నాయని కితాబు ఇచ్చారు. జర్మనీ, అక్కడి పారిశ్రామికవేత్తలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
జర్మనీలో జీడీపీలో 80 శాతం చిన్న తరహా పరిశ్రమల నుంచే వస్తుందని, ఇలాంటి విధానమే మన దేశంలో కూడా రావాలన్నారు. మన దగ్గర ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలు చాలా ఉన్నాయని తెలిపారు. త్వరలో హైదరాబాద్ నుంచి జర్మనీకి ప్రత్యేక ఫ్లైట్ సర్వీస్ ఉంటుందని తెలిపారు. అలాగే.. రాష్ట్రంలో డిఫెన్స్ ల్యాబ్లు, ఏరోస్పేస్ పరిశ్రమలు, పరిశోధనా కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.
మన రాష్ట్రంలో ఏడున్నరేండ్లలో పారిశ్రామిక విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. పరిశ్రమలకు సింగిల్ విండో విధానాన్ని తీసుకవచ్చామనీ, దరఖాస్తు చేసుకున్న ఏ కంపెనీకి అయినా.. 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. అమెరికాలో కూడా టీఎస్ ఐపాస్ లాంటి చట్టం లేదని స్పష్టం చేశారు. టీఎస్ ఐపాస్ ద్వారా 17,500 కంపెనీలకు ఇప్పటి వరకు క్లియరెన్స్ ఇచ్చామని ఘనత టీ సర్కార్ కే దక్కిందని కేటీఆర్ తెలిపారు. తమ పెట్టుబడి కోసం తెలంగాణను ఎంచుకున్నందుకు జర్మనీ కంపెనీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ పెట్టుబడితో దేశంలోనే ఎలక్ట్రిక్ వాహన రంగ తయారీకి తెలంగాణ కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేటీఆర్.