నా పార్టీ వాళ్లే నన్ను ఓడించారు.. కాంగ్రెస్ నేత చల్మెడ లక్ష్మీనరసింహరావు.. 8న గులాబి గూటికి
కాంగ్రెస్ సీనియర్ నేత చల్మెడ లక్ష్మీనరసింహరావు పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఈ నెల 8వ తేదీని ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తనకు గుర్తింపు ఇచ్చిందని, కానీ, పార్టీలో అంతర్గత కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయని ఆరోపించారు. తన పార్టీ వాళ్లే తనను ఓడించారని అన్నారు. అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
కరీంనగర్: Congress సీనియర్ నేత, చల్మెడ ఆనందరావు వైద్య కళాశాల చైర్మన్ లక్ష్మీనరసింహరావు(Chalmeda Laxminarasimha Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలపై విమర్శలు చేశారు. తాను పార్టీపై విమర్శలు చేయాలని అనుకోవడం లేదని అన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తనకు గుర్తింపు ఇచ్చిందని వివరించారు. సోనియా గాంధీ తనకు మూడు పర్యాయాలు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారని తెలిపారు. కానీ, ఆమె అవకాశం ఇచ్చిన ప్రతిసారీ తమ పార్టీ వాళ్లే ఆయనను ఓడించారని ఆరోపణలు చేశారు. అంతర్గత కుట్రలు, కుతంత్రాలతో ఓడిపోయారని వివరించారు. త్వరలోనే తాను టీఆర్ఎస్(TRS)లో చేరాలనే(Join) నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు.
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వచ్చి ఆయన కొంత ఉత్సాహం నింపాడని చల్మెడ లక్ష్మీనరసింహారావు తెలిపారు. కానీ, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఆందోళనలకరంగా ఉన్నదని అన్నారు. ఇరవై సంవత్సరాలు తాను ఈ పార్టీతో కలిసి కొనసాగారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నరు. కానీ, ఇప్పటి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పారు. పార్టీలో చిత్తశుధ్ది లోపించిందని అన్నారు. ఎన్నికల్లో సొంత పార్టీ గెలవాలని కాకుండా.. మరో పార్టీ ఓడిపోవాలని ఆలోచనలు చేయడం దురదృష్టకరం అని వివరించారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలువాలనే దాని కంటే టీఆర్ఎస్ ఓడిపోవాలనే చూడటం బాధాకరమని అన్నారు. హుజురాబాద్లో మూడు వేల ఓట్లు రావడం కాంగ్రెస్ పార్టీకే సిగ్గు చేటు అని అన్నారు. ఈ నేపథ్యంలోనే తాను తన అనుచరులందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చినట్టు వివరించారు. కాంగ్రెస్ను విమర్శించకుండానే పార్టీ వీడాలనే ఏకాభిప్రాయానికి వచ్చామని అన్నారు. తాము త్వరలోనే టీఆర్ఎస్లో చేరబోతున్నామని తెలిపారు.
కేసీఆర్ ప్రాజెక్టులు పెట్టి తెలంగాణను బలోపేతం చేశారని, రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇవ్వడం చాలా బాగా నచ్చాయని, అది కేసీఆర్ ఘనతలు అని వివరించారు. కేసీఆర్ నాయకత్వంలో ఎలాంటి షరతులు లేకుండా ఈ నెల 8వ తేదీన టీఆర్ఎస్లో చేరబోతున్నట్టు వెల్లడించారు. కొందరు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలో గులాబీ పార్టీలో చేరుతామని తెలిపారు.
లక్ష్మీనరసింహరావు కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్కు అత్యంత సన్నిహితుడు. టీఆర్ఎస్లో చేరాలని అనుచరుల నుంచి ఒత్తిడి రావడం, కేటీఆర్ అనుకూలంగా స్పందించడంతో చల్మెడ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నెల 8వ తేదీన తెలంగాణ భవన్లో తన అనుచరులతో కలిసి కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.
Also Read: కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు...: గోనె ప్రకాష్ రావు సంచలనం (video)
అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కరీంనగర్ నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ రెండు సార్లు గంగుల కమలాకర్ గెలుపొందారు. అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో చల్మెడ లక్ష్మీనరసింహరావు ఉన్నట్టు తెలుస్తున్నది. చల్మెడ లక్ష్మీనరసింహరావు స్వస్థలం వేములవాడ నియోజకవర్గమే. వేములవాడ ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు పౌరసత్వ అంశం ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. చల్మెడ చేరికతో కరీంనగర్తోపాటు, వెములవాడలోనూ టీఆర్ఎస్కు మరింత బలం చేకూరినట్టు అయింది.