స్వప్నలోక్ : షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం.. నోటీసులిచ్చినా పట్టించుకోలేదు..
స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అగ్నిమాపక డీజీ తెలిపారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ప్రమాదం సంభవించిందని తెలిపారు.

హైదరాబాద్ : గత రాత్రి సికింద్రాబాద్లో తీవ్ర భయాందోళనలకు గురిచేసిన స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూటే అని అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ లో రద్దీగా ఉండే స్వప్నలోక్ కాంప్లెక్స్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీని కారణంగా కాంప్లెక్స్ లోని ఐదు, ఏడు అంతస్తులో ఉన్న దుకాణాలు ధ్వంసమయ్యాయి. కాగా ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగా భావిస్తున్నామని వారు తెలిపారు. నాగిరెడ్డి మాట్లాడుతూ.. గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో తమకు అగ్ని ప్రమాదం గురించిన సమాచారం అందిందని అన్నారు.
సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకుని.. సహాయక చర్యలు ప్రారంభించామని తెలిపారు. అలా 12 మందిని రక్షించగలిగామని అన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే స్వప్నలోక్ బిల్డింగ్ యజమానులు ఫైర్ సేఫ్టీ పెట్టుకోవాలని తాము చెప్పిన సూచనలు పెడచెవిన పెట్టారని అన్నారు. వారు దాన్ని నిర్లక్ష్యం చేశారు. ఏదో పేరుకు మాత్రం ఫైర్ సేఫ్టీ అని పెట్టారు కానీ అవి అసలు పని చేయడం లేదు.
మంటల్లో చిక్కుకున్నస్వప్నలోక్ కాంప్లెక్స్ .. ఆరుగురి దుర్మరణం.. మృతులందరూ పాతికేళ్ల లోపు వారే.
ఈ ఘటనకు కారణం షాప్ కీపర్ల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రద్దీ ఏరియాలో ఉండే ప్రతి కమర్షియల్ కాంప్లెక్స్ లోనూ ఫైర్ ఫైటింగ్ సిస్టం తప్పనిసరిగా ఉండాలి. అంతేకాదు, ఫైర్ సేఫ్టీ పెట్టుకోగానే సరిపోదు. వాటిని ఎప్పటికప్పుడు అవసరానికి పనిచేసేలా నిర్వహణ కూడా సరిగా చూసుకోవాలి. ముఖ్యంగా కమర్షియల్ కాంప్లెక్స్ లను పూర్తిగా లాక్ చేయకూడదు.. అని తెలిపారు.
ఇక బిల్డింగ్ పటుత్వం గురించి మాట్లాడుతూ ప్రస్తుతానికైతే బిల్డింగ్ పరిస్థితి బాగానే ఉంది.. అని ఆయన చెప్పారు. కాకపోతే బిల్డింగ్ లాక్ చేసి ఉండడం వల్లే లోపలినుంచి.. బయటికి రాలేక ఆ పొగతో ఊపిరాడక కొంతమంది చనిపోయారని అన్నారు. మెయింటెనెన్స్ విషయంలో ఇలాంటి నిర్లక్ష్యం పనిచేయదు. వ్యాపార లావాదేవీలు నిర్వహించే వారికి ఇది పెద్ద దెబ్బగా పరిణమిస్తుంది.సేఫ్టీ మెజర్మెంట్స్ మెరుగుపరచుకోవాలని గతంలోనే స్వప్నలోక్ కాంప్లెక్స్ యాజమాన్యానికి నోటీసులు కూడా ఇచ్చాం.
ఇలాంటి ప్రమాదాలు ఇక ముందు జరగకుండా ఉండాలంటే.. ప్రజల్లోనూ అవగాహన ఉండాలి. ప్రతి కాంప్లెక్స్ లో కూడా మెట్ల దారి, లిఫ్ట్ రెండు తెరిచే ఉండాలి. ఒకవేళ ఏ కాంప్లెక్స్ లోనైనా మెట్ల దారి లాక్ చేసి ఉన్నట్లయితే 101 కు ఫోన్ చేసి సమాచారం చెప్పవచ్చు.. అని నాగిరెడ్డి తెలిపారు.