Telangana new ministers: తెలంగాణ మంత్రివర్గంలోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు చేరారు. జీ.వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, వాకిటి శ్రీహరిలు మంత్రులుగా ప్రమాణం చేశారు. అలాగే, రామచంద్రు నాయక్ కు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది.

Telangana new ministers: తెలంగాణలో మంత్రివర్గంలో జీ.వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, వాకిటి శ్రీహరిలు చేరారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నూతన మంత్రులుగా వీరు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Scroll to load tweet…

సామాజిక న్యాయాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకుని మంత్రి వర్గ విస్తరణ చేశారు. ఎస్సీ వర్గంలోని మాల ఉపవర్గానికి చెందిన జి.వివేక్‌, మాదిగ ఉపవర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, బీసీ వర్గానికి చెందిన ముదిరాజ్‌ సామాజిక తరగతికి చెందిన వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. వీరితో పాటు ఎస్టీ బంజారా వర్గానికి చెందిన రామచంద్రు నాయక్ కు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. కొత్త మంత్రుల రాజకీయ నేపథ్యం గమనిస్తే..

అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మపురి నియోజకవర్గం నుంచి 2023లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1968లో కరీంనగర్‌ జిల్లాలో జన్మించిన ఆయన విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ నాయకత్వ స్థాయిల్లో పని చేసి, 2006లో జడ్పీటీసీగా గెలిచారు. అనంతరం జడ్పీ చైర్మన్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన ఆయన 2023లో విజయం సాధించారు.

వాకిటి శ్రీహరి

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌కు చెందిన వాకిటి శ్రీహరి 2023లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చిట్టెం రామ్మోహన్‌రెడ్డిపై 17,522 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గతంలో మక్తల్‌ సర్పంచిగా, జడ్పీటీసీగా, జడ్పీ ఫ్లోర్ లీడర్‌గా, నారాయణపేట్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. గ్రాస్‌రూట్ స్థాయిలో క్రియాశీలంగా పని చేసిన ఆయనకు ఇప్పుడు మంత్రి పదవి లభించింది.

జీ.వివేక్‌

చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన జి.వివేక్‌ మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి వారసుడు. 2009లో పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించిన ఆయన, 2013లో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు బీఆర్ఎస్) లో చేరారు. అనంతరం కాంగ్రెస్‌లోకి తిరిగి వెళ్లి 2014లో ఓడిపోయారు. 2016లో మళ్లీ తెరాసలోకి, 2019లో బీజేపీలోకి ప్రవేశించి, చివరగా 2023లో కాంగ్రెస్‌లో చేరారు. అదే ఏడాది చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కుమారుడు వంశీ 2024లో పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచారు.