టాక్స్ హాలీడే ప్లీజ్.. ప్యాకేజీల కోసం మొబైల్ ఫోన్స్ ఇండస్ట్రీ
సుదీర్ఘకాలంగా నానుతూ ఉన్న టాక్స్ హాలీడే తమకు వర్తింప జేయాలని మొబైల్ ఫోన్ల తయారీ రంగం ప్రభుత్వాన్ని కోరుతోంది. విదేశీ సంస్థల నుంచి తలెత్తే పోటీని ఎదుర్కొనేందుకు తమకు ఇంకా సుంకాల్లో రాయితీలు కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ను అభ్యర్థించింది.

న్యూఢిల్లీ: అవసరాలు, మార్కెట్లో పరిస్థితులను బట్టి కార్పొరేట్ సంస్థలు మాట మార్చేస్తాయా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పోటీ ప్రపంచంలో దూసుకెళ్లాలంటే ఇతర దేశాల సంస్థలతో సమానంగా సాగాలంటే ఆయా సంస్థలను ఆహ్వానించాలని ఇండియన్ కార్పొరేట్లు గతంలో చెప్పేవారు. ప్రస్తుతం దేశీయ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో చైనా, దక్షిణ కొరియా కంపెనీలదే హవా.
ఆ దేశాల స్మార్ట్ ఫోన్ దిగ్గజాల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని దేశీయ మొబైల్ ఫోన్ల (హ్యాండ్సెట్) తయారీ పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరింది. స్థానిక మాన్యుఫ్యాక్చరింగ్ విధానం తేవటం ద్వారా దేశం నుంచి పెద్దఎత్తున ఎగుమతులు ప్రోత్సహించే చర్యలు తీసుకోవాలని బడ్జెట్ సిఫారసుల్లో ప్రభుత్వానికి విన్నవించింది. అంతేకాకుండా సుదీర్ఘకాలంగా నానుతున్న లాంగ్ టాక్స్ హాలీడేపై నిర్ణయం తీసుకోవాలని కోరింది.
దేశీయంగా ఉత్పత్తి అవుతున్న మొబైల్ ఫోన్లు, విడిభాగాల లాభాలపై దీర్ఘకాలిక పన్ను హాలీడేను అందించాలని పరిశ్రమ దశాబ్ద కాలంగా కోరుతోంది. ఈ తరహా చర్యలతో దేశంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వచ్చే అవకాశం ఉందని, ధరలు తగ్గేందుకు వీలుందని పేర్కొంది. అలాగే రూ.1,200 వరకు ధర కలిగిన ఫీచర్ ఫోన్లకు సంబంధించిన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ అసెంబ్లీ (పీసీబీఏ)పై సంవత్సరాంతం వరకు బేసిక్ కస్టమ్స్ సుంకాల మినహాయింపులు ఇవ్వాలని కూడా పరిశ్రమ విన్నవించింది.
అదే విధంగా బ్యాటరీలు, చార్జర్స్పై విధిస్తున్న వస్తు సేవల పన్ను (జీఎ్సటీ)ని 12 శాతానికి తగ్గించాలని కోరింది. ప్రస్తుతం వీటిపై 18 నుంచి 20 శాతం వరకు పన్ను విధిస్తున్నారు. వ్యూహాత్మక విభాగాల్లో టెక్నాలజీపై నియంత్రణ ఉండే విధంగా దేశీయంగా భారీ స్థాయి కంపెనీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అందుకుతగ్గట్టుగా సమగ్రమైన వ్యూహాత్మక ముసాయిదాను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని బడ్జెట్ సిఫారసుల్లో ఇండియన్ సెల్యూలార్ అండ్ ఎలకా్ట్రనిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) నొక్కిచెప్పింది.
మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 2018-19లో దేశీయ మొబైల్ తయారీ పరిశ్రమ రూ.1.7 లక్షల కోట్ల విలువైన 29 కోట్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేసిందని పేర్కొంది. 2014-15లో 82 శాతం ఉన్న దిగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 7 శాతానికి పడిపోయాయని పేర్కొంది. భారత్ను దశలావారీగా తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తే ఎగుమతులపై దృష్టి పెట్టే అవకాశం లభిస్తుందని, ఇది దేశీయంగా తయారీని ప్రోత్సహించినప్పుడే సాధ్యమవుతుందని పరిశ్రమ తెలిపింది.
ఇక కాంపోనెట్ మాన్యుఫ్యాక్చరింగ్ రెవెన్యూలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.75,000 కోట్ల స్థాయిల్లో ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.లక్ష కోట్ల మార్కును చేరుకోవచ్చని అంచనా వేస్త్ట్లున్నట్లు ఐసీఈఏ తెలిపింది. అలాగే స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్స్కు సంబంధించి రాయల్టీల అంశంపై కూడా పరిశ్రమ కొన్ని సిఫారసులు చేసింది.