నా ఆనందం ఒక్క క్షణంలో ఆవిరైంది..యూవీ
మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికైనప్పుడు శిఖరాన్ని అధిరోహించినట్టు ఉంటుంది. కానీ, అకస్మాత్తుగా అగాథంలోకి పడిపోయా
టీం ఇండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్.. క్యాన్సర్ తో పోరాడి విజయం సాధించారన్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ విషయం తెలిసిన తర్వాత తన ఫీలింగ్ ని యువీ వివరించాడు. వరల్డ్ కప్ విజయం సాధించిన తర్వాత క్యాన్సర్ ఉందని తెలియడంతో తన ఆనందం అంతా ఒక్క క్షణంలో ఆ ఆనందమంతా ఆవిరైపోయిందని ఆయన తెలిపాడు.
కొంతకాలంగా పేలవ ఫామ్ కారణంగా భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న యువీ... ప్రస్తుతం దేశవాళీ టోర్నీలో భాగమైన విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నాడు. ఈ సందర్బంగా ఓ మీడియాతో మాట్లాడిన యూవీ.. పలు విషయాలు వివరించాడు. ‘వరల్డ్కప్ విజయం తర్వాత క్యాన్సర్ ఉందని తెలియడం నా ఆనందాన్ని ఒక్క క్షణంలో చిదిమేసింది. అవి నా జీవితంలో చీకటి రోజులు. నువ్వు వరల్డ్కప్ గెలిచినప్పుడు, నువ్వు మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికైనప్పుడు శిఖరాన్ని అధిరోహించినట్టు ఉంటుంది. కానీ, అకస్మాత్తుగా అగాథంలోకి పడిపోయా. జీవితం ఇంతే. ఏం జరుగుతుందో తెలియదు. మరో అవకాశమే ఇవ్వదు’ అని యువరాజ్ ఉద్వేగ భరితంగా మాట్లాడాడు.
ప్రస్తుతం టీమిండియా జట్టులో చోటుదక్కించుకోవడం అనేది తన చేతుల్లో లేదన్నాడు. తనకు 2019 వరల్డ్కప్లో ఆడాలనే కోరిక ఉందని, అదే లక్ష్యంతో దేశవాళీ మ్యాచ్ల్లో రాణించడానికి వందశాతం యత్నిస్తున్నానని తెలిపాడు. కాకపోతే తాను సెలక్ట్ కావడం అనేది మేనేజ్మెంట్ చేతుల్లో ఉంటుందన్నాడు.