కర్ణాటకలో బిజెపికి కేసీఆర్ చేయూత: భేటీ మతలబు అదే, వెనక అమిత్ షా...
కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బిజెపికి ఉపయోగపడే చర్యకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పూనుకున్నారనే మాట వినిపిస్తోంది.
హైదరాబాద్: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బిజెపికి ఉపయోగపడే చర్యకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పూనుకున్నారనే మాట వినిపిస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు పేర కేసిఆర్ బెంగళూరు వెళ్లి జెడిఎస్ నేత దేవెగౌడను, ఆయన కుమారుడు కుమారస్వామిని కలవడం వెనక వ్యూహం అదేనని అంటున్నారు.
దేవెగౌడ మాట ఎలా ఉన్నా కుమారస్వామి బిజెపికి అనకూలంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కాంగ్రెసుతో అవగాహనకు దేవెగౌడ సిద్ధపడినప్పటికీ కుమారస్వామి అందుకు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారని అంటున్నారు. జెడిఎస్ బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తోందని అంటున్నారు.
తెలంగాణ కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి కూడా అదే మాట అంటున్నారు. కర్ణాటక ఎన్నికల్లో టిఆర్ఎస్, మజ్లీస్ జెడిఎస్ కు మద్దతు పలకడం వెనక బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఉన్నారని ఆయన అన్నారు.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి పరోక్ష నష్టం కలిగించేందుకే జెడిఎస్ సీట్లు పెరిగే విధంగా ప్రణాళిక రూపొందించారని ఆయన అన్నారు. ఎన్నికల తర్వాత జెడిఎస్ బిజెపితో కలబోదని కేసిఆర్, అసదుద్దీన్ ఓవైసీ హామీ ఇవ్వగలరా అని ఆయన ప్రశ్నించారు.
తాను పాదయాత్ర చేస్తానంటే అధిష్టానం అంగీకరించలేదనే మాటలో వాస్తవం లేదని ఆయన అన్నారు. తాను ఆ విధమైన ప్రతిపాదన ఏదీ పెట్టలేదని స్పష్టం చేశారు.