అదనపు కట్నం వేధింపులు.. డ్రగ్స్ మత్తులో భార్య తలపై మూత్రవిసర్జన, చిత్రహింసలు..
అదనపు కట్నం కోసం నీఛానికి దిగజారాడో వ్యక్తి. డ్రగ్స్ మత్తులో అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు. స్నేహితులతో కలిసి భార్యను చిత్రహింసలు పెట్టాడు.
కర్ణాటక : ఆడపిల్లకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అంగరంగ వైభవంగా పెళ్లి, అంతకుమించి కట్నకానుకలు.. ఇచ్చినా వరుడి కట్నదాహాన్ని తీర్చలేకపోయారు. ఆ దాహానికి అంతులేకుండా పోయింది. ఇంకా, ఇంకా తేవాలని సతాయిస్తూ డ్రగ్స్ మత్తులో ఆమెకు నరకం చూపించాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని బసశంకరిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన 28 ఏళ్ల బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రైవేటు కంపెనీ ఉద్యోగి సుదీప్ మీద బెంగళూరు బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఆ యువతికి-సుదీప్ కు 2021లో పెళ్లి జరిగింది. వరుని కుటుంబం డిమాండ్ మేరకు వధువు కుటుంబీకులు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో వైభవోపేతంగా పెళ్లి జరిపించారు. పెళ్లి సమయంలో రూ. 55 లక్షల విలువచేసే మినీ కూపర్ కారు, 200 కిలోల వెండి, 4 కిలోల బంగారు ఆభరణాలను సుదీప్ కు ముట్ట చెప్పారు. కట్నం, పెళ్లి ఖర్చులు కలిపి రూ. 6 కోట్లు అయినట్లు తెలిపింది. అయితే, ఇంత గ్రాండ్ గా పెళ్లి చేసి ఇన్ని కట్నకానుకలు ఇచ్చినా అతడిలో అసంతృప్తి తగ్గలేదు.
డ్రగ్స్ మత్తులో అరాచకం..
పెళ్ళైన కొద్ది రోజులకే.. వీటితో సంతృప్తి చెందని భర్త సుదీప్, పుట్టింటి నుంచి మరింత డబ్బు తేవాలని భార్యను వేధించాడు. దీంతో యువతి తండ్రి తమ రెండు కంపెనీలను అల్లుని పేరిట రాశారు. ఆ కంపెనీలో వచ్చే లాభం సుదీప్ తీసుకునేవాడు. ఈ క్రమంలో సుదీప్ డ్రగ్స్ కు బానిస అయ్యాడు. స్నేహితులను ఇంటికి పిలిపించుకుని డ్రగ్స్ తీసుకునేవాడు. ఆ మత్తులో భార్య తలపై మూత్ర విసర్జన చేసి వికృతంగా ప్రవర్తించేవాడు. దీనిని ప్రశ్నిస్తే భార్యను అసభ్యంగా దూషించేవాడు. ఈ విషయాన్ని ఆమె అత్తమామలకు చెప్పుకోగా.. వారు కొడుకునే వెనకేసుకొచ్చారు. పైగా నిన్నే చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదులో తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కట్నం కోసం కట్టుకున్నవాడి కర్కశత్వం... హైదరాబాద్ లో వివాహిత ఆత్మహత్య
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఆగస్ట్ 1న హైదరాబాద్ లో వెలుగుచూసింది. అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి, తాళి కట్టిన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడో భర్త. పెళ్లైన కొద్ది రోజులు బాగానే ఉన్నా.. ఆ తరువాత ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరగడం ప్రారంభించాడు. ఖర్చులకు డబ్బులేక భార్యను అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. అనుకున్నది జరగక పొయేసరికి నీచానికి తెగించాడు. పడక గదిలో తామిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు ఆమెకు తెలియకుండా.. తన ఫోన్లో వాటిని రికార్డ్ చేశాడు. ఆ తరువాత వాటిని స్నేహితుడికి పంపించాడు.
ఈ విషయం భార్యకు తెలిసి భర్తను నిలదీసింది. దీంతో తన స్నేహితుడితో ఏకాంతంగా గడపాలని ఒత్తిడి చేశాడు. జరిగిన ఘోరాన్ని అత్తమామల దృష్టికి తీసుకువెళ్లగా.. కుమారుడు చేసిన నిర్వాకాన్ని వారూ సమర్ధించారు. అదనపు కట్నం తేవాలని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా భర్త బంధువులు ఆమె మీద దాడి కూడా చేశారు. ఈ వేదన భరించలేక ఆమె శంషాబాద్ పోలీసులను ఆశ్రయించింది. భర్త, అత్తా మామలతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.