23 అడుగుల గోడ దూకి జైలు నుంచి ఇద్దరు ఖైదీల ఎస్కేప్.. రేప్, మర్డర్ కేసుల్లో నిందితులు
ఛత్తీస్గడ్లోని జష్పూర్ జిల్లా జైలు నుంచి ఇద్దరు ఖైదీలు సోమవారం ఉదయం పారిపోయారు. రేప్ కేసులో ఒకరు, మర్డర్ కేసులో మరొకరు నిందితులుగా ఉన్నారు. వీరిపై జష్పూర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైనట్టు జిల్లా అదనపు ఎస్పీ ఉమేశ్ కశ్యప్ తెలిపారు.
న్యూఢిల్లీ: ఛత్తీస్గడ్కు చెందిన ఓ జైలు నుంచి ఇద్దరు విచారణ ఖైదీలు పరారయ్యారు. 23 అడుగుల ఎత్తుతో నిర్మించిన బౌండరీ వాల్ పై నుంచి దూకి సోమవారం ఉదయం వారు జంప్ అయ్యారు. ఇందులో ఒకరిపై రేప్ కేసు, మరొకరిపై మర్డర్ కేసు ఉన్నది. ఈ రెండు కేసుల్లో విచారణ జరుగుతున్నట్టు జష్పూర్ జిల్లా అదనపు ఎస్పీ ఉమేశ్ కశ్యప్ అన్నారు.
జష్పూర్ జిల్లా జైలు నుంచి వీరిద్దరు తప్పించుకున్నారు. కపిల్ భగత్, లలిత్ రామ్లుగా వారిని అధికారులు గుర్తించారు. గతేడాది ఓ మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో కపిల్ భగత్ నిందితుడిగా ఉన్నాడు. ఆయనపై జష్పూర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతున్నది. జష్పూర్ జిల్లా సోగ్దా గ్రామానికి చెందినవాడు. ఈ రేప్ కేసులో జిల్లా జైలులో కపిల్ భగత్ ఉన్నాడు.
పారిపోయిన మరో ఖైదీ లలిత్ రామ్ తుమ్లా ఏరియాకు చెందినవాడు. ఈయన పై మర్డర్ కేసు ఉన్నది. ఈ కేసును కంకూరి అదనపు జిల్లా జడ్జీ విచారిస్తున్నారు.
Also Read: నాగాల్యాండ్ జైలు నుంచి హత్యా నేరస్తులు, ఇతర ఖైదీలు పరార్
వీరిద్దరూ సోమవారం ఉదయం పారిపోయారని అదనపు ఎస్పీ ఉమేశ్ కశ్యప్ అన్నారు. ఆ సమయంలో జైలులో ఖైదీల కోసం వంటలు చేస్తున్నారు. ఆ సమయంలో వీరిద్దరూ పారిపోయారని వివరించారు. జైలు సెక్యూరిటీని మరింత పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా, పారిపోయిన వీరిద్దరు ఖైదీలపై జష్పూర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు వివరించారు.