భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్త వాతవరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న అందోళన అందరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ సంఘటన అందరి దృష్టిని ఆకర్ఫించింది. సౌదీ అరేబియా విదేశాంగ శాఖ జూనియర్ మంత్రి ఉన్నపలంగా ఢిల్లీ వచ్చారు.
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న వేళ, సౌదీ అరేబియా విదేశాంగ శాఖ జూనియర్ మంత్రి అదెల్ అల్ జుబైర్ ముందస్తు సమాచారం లేకుండా న్యూఢిల్లీకి వచ్చారు. శుక్రవారం ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో భేటీ అయ్యారు. ఈ భేటీ ప్రధానంగా ఇండియా, పాక్ దేశాల మధ్య ఉన్న పరిస్థితులను సమీక్షించడమే లక్ష్యంగా చేపట్టినట్లు తెలుస్తోంది.
జైశంకర్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఈ భేటీ వివరాలను వెల్లడించారు. “సౌదీ మంత్రి అదెల్ అల్ జుబైర్తో ప్రయోజనకరమైన చర్చ జరిగింది. ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న కఠిన వైఖరిని ఆయనకు వివరించాను,” అని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల భారత్ చేపట్టిన "ఆపరేషన్ సిందూర్" తర్వాత ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో, జాతీయ భద్రతకు మద్దతుగా మరియు ఉద్రిక్తతలు తగ్గించేందుకు అంతర్జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా ఈ భేటీగా భావిస్తున్నారు.
ఇటు సౌదీ అరేబియా మాత్రమే కాకుండా, ఇరాన్ కూడా ఈ పరిణామాల్లో చురుకుగా పాల్గొంటోంది. ఇరాన్ ఉపవిదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్ఛి ఇటీవల ఢిల్లీకి వచ్చి జైశంకర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరాన్, భారత్, పాక్ మధ్య సుస్థిర సంబంధాల ఏర్పాటుకు తమ దేశం సిద్ధంగా ఉందని తెలియజేశారు.
ఇంతకుముందు అరాగ్ఛి పాకిస్థాన్ను కూడా అకస్మాత్తుగా సందర్శించి అక్కడి నేతలతో సంప్రదింపులు జరిపారు. అనంతరం తిరిగి ఇరాన్కు వెళ్లిన ఆయన, వెంటనే భారత్ వచ్చారు. ఈ క్రమంలో భారత ఉపఖండంలో శాంతిని నెలకొల్పేందుకు ఇరాన్ సరిహద్దులపై మద్దతు ఇచ్చే ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.