PM Modi Meets Army Chief Upendra Dwivedi: ఆపరేషన్ సింధూర్ తర్వాత, భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోడీ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదితో భేటీ అయ్యారు. ఇరువురు భారత్-పాక్ ఉద్రిక్తతలు, ప్రస్తుత పరిస్థితులపై చర్చించారని సమాచారం.
Operation Sindoor: ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో కీలక సమావేశం నిర్వహించారు.
15 భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ భారీ ఎత్తున క్షిపణి, డ్రోన్ దాడికి యత్నించిన కొన్ని గంటల తర్వాత ఈ ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. ఈ దాడిని భారత వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది.
నియంత్రణ రేఖ, పశ్చిమ సరిహద్దుల్లో పెరుగుతున్న భద్రతా పరిస్థితి, వైమానిక, ఫిరంగి ఆయుధాలను పాకిస్తాన్ ఉపయోగించడం, భారతదేశం దానికి తగిన సైనిక ప్రతిస్పందన ఇవ్వడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. లాహోర్లోని పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులు జరుగుతున్న నేపథ్యంలో, యుద్ధభూమి పరిణామాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చూస్తూనే కార్యాచరణ సంసిద్ధతను కొనసాగించాలనే దృఢ సంకల్పంతో ఉందని ఈ సమావేశం తెలియజేస్తోంది.
రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, పాకిస్తాన్ నైరుతి, ఉత్తర భారతదేశంలో ఉన్న 15 సైనిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడింది. ఈ ప్రాంతాల్లో అవంతిపుర, శ్రీనగర్, జమ్ము, పఠాన్కోట్, అమృత్సర్, భుజ్ ఉన్నాయి. అయితే, భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, కౌంటర్ UAV గ్రిడ్ ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి.
భారత సాయుధ దళాలు గురువారం తెల్లవారుజామున ప్రతిచర్యగా పాకిస్తాన్ లోని ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలపై ఖచ్చితమైన దాడులు జరిపాయి. లాహోర్ సమీపంలో ఉన్న ఒక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను విజయవంతంగా నిర్వీర్యం చేసినట్టు రక్షణ శాఖ ధృవీకరించింది.
ఇది, మే 7న భారత వాయుసేన నిర్వహించిన ఆపరేషన్ సింధూర్కు కొనసాగింపుగా ఉంది. ఈ దాడిలో పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న తొమ్మిది ఉగ్రశిబిరాలు లక్ష్యంగా మారాయి. ఇందులో జైషే మహ్మద్ (JeM), లష్కరే తోయిబా (LeT) వంటి ప్రధాన ఉగ్ర సంస్థల శిబిరాలు ఉన్నాయి.
కగా, పాకిస్తాన్, నియంత్రణ రేఖ (LoC) వెంబడి ఆర్టిలరీ, మార్టార్ షెల్లింగ్ను పెంచినట్టు రక్షణ శాఖ పేర్కొంది. ఈ కాల్పుల్లో కుప్వారా, ఉరీ, పూంఛ్, రాజౌరీ ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. ఈ దాడుల్లో 16 మంది సాధారణ ప్రజలు, మహిళలు, చిన్నపిల్లలు సహా ప్రాణాలు కోల్పోయినట్టు రక్షణ శాఖ తెలిపింది. దీంతో, భారత్ తప్పనిసరిగా కౌంటర్ దాడులకు పాల్పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది.
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించడమే భారత్ సైనిక ప్రతిచర్యకు కారణంగా నిలిచిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి గురువారం తెలిపారు. గతంలో 26/11, పఠాన్కోట్ దాడులపై భారత్ ఇచ్చిన ఆధారాలను పాకిస్తాన్ పట్టించుకోలేదని ఆయన చెప్పారు.